Bharat-biotech Company Lumpy Skin Vaccine : భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి (ఎల్ఎస్డీ) టీకా అందుబాటులోకి రాబోతోంది. పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి నుంచి రక్షించడానికి ఈ టీకా ఇస్తారు. ఎల్ఎస్డీ వ్యాధితో గత రెండేళ్లలో 2 లక్షల పశువులు మృతి చెందాయి. దీంతో భారత్ బయెటెక్ సంస్థ ఈ టీకాను కనిపెట్టింది. ‘బయోలంపివ్యాక్సిన్’ అనే ఈ టీకా మన దేశంలో మొదటిది. దీనికి సీడీఎస్సీఓ (సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నుంచి లైసెన్సు వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది.
లంపీ స్కిన్ వ్యాధికి టీకా : ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పని చేస్తుందని పేర్కొంది. దీన్ని ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)లలో విస్తృతంగా పరీక్షించినట్లు వివరించింది. హిస్సార్లోని ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ అందించిన ఎల్ఎస్డీ వైరస్/ రాంచీ/ 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్తో బయోవెట్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది.
ఈ టీకాకు సీడీఎస్సీఓ లైసెన్సు లభించడం, మన దేశంలో పశు సంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఎల్ఎస్డీ వ్యాధి వల్ల మనదేశంలో గత రెండేళ్లలో 2 లక్షల పశువులు చనిపోయాయి. ఇంకొన్ని లక్షల పాడి పశువులు వట్టిపోయాయి. దీంతో ఈ వ్యాధిని నిరోధించడం కోసం ఎల్ఎస్డీ టీకా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు.
ఏటా 50 కోట్ల డోసుల తయారీ : బయోలంపివ్యాక్సిన్ను వెంటనే విడుదల చేస్తామని కృష్ణ ఎల్ల తెలిపారు. బయోవెట్కు కర్ణాటకలోని మల్లూర్లో ఉన్న యూనిట్లో ఏటా 50 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్ఎస్డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్ వర్గాలు వివరించాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొన్నాయి.
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ - Vice President Visit Bharat Biotech
కలరా నియంత్రణకు భారత్ బయోటెక్ హిల్కాల్ వ్యాక్సిన్ - Bharat Biotech Oral Cholera Vaccine