Champions Trophy 2025 :ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. ఇందులో చిన్న జట్లతో ఏకపక్ష, బోర్ కొట్టించే మ్యాచ్లుండవు. ఇక్కడ బరిలో ఉన్నవన్నీ బలమైన, ప్రమాదకర జట్లే. టోర్నీ సుదీర్ఘంగా సాగి విసుగు పుట్టించదు. 19 రోజుల్లో, 15 మ్యాచ్లతో టోర్నీ ముగుస్తుంది. ప్రతి మ్యాచ్ ఫలితమూ కీలకమే, ప్రతి పోరూ రసవత్తరమే!
అందుకే దీన్ని అభిమానులు మినీ ప్రపంచకప్గా పిలుచుకుంటారు. అదే ఛాంపియన్స్ ట్రోఫీ. దీనికి బుధవారమే తెర లేవనుంది. పాకిస్థాన్- న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మినీ వరల్డ్కప్ ప్రారంభం కానుంది. ఇక ఆతిథ్యం ఇస్తుంది పాకిస్థానే అయినప్పటికీ, అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న టీమ్ఇండియా టైటిల్ ఫేవరెట్లలో ఒకటడనడంలో సందేహం లేదు. అయితే ఈ మినీ ప్రపంచకప్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా మరికొన్ని విషయాలు తెలుసుకుందామా?
బోణీ ఎవరిదో?
ఎప్పుడో 1996లో వన్డే ప్రపంచకప్నకు భారత్, శ్రీలంకలతో కలిసి ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చింది పాకిస్థాన్. ఆ తర్వాత ఆ దేశంలో ఏ ఐసీసీ టోర్నీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్, ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటాలనుకుంటోంది. సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న ఆ జట్టు టోర్నీలో శుభారంభం చేయాలని ఆశిస్తోంది.
అయితే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ రూపంలో ఆ జట్టుకు కఠిన సవాలే ఎదురవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన ముక్కోణపు సిరీస్లో కివీస్ పాక్ను లీగ్ దశలోనే కాక ఫైనల్లోనూ ఓడించింది. మరి ట్రై సిరీస్లో ఎదురైన ఓటములకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకొని శుభారంభం చేయాలని పాక్ భావిస్తోంది. చూడాలి మరి ఈసారి పాక్ పైచేయి సాధిస్తుందా? లేదా కివీస్దే బోణీ అవుతుందా?
డిఫెండింగ్ ఛాంప్ హోదాలో
చివరిసారిగా జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ టైటిల్ విజేకగా నిలిచింది. దీంతో ఈసారి ఆతిథ్య జట్టు డిఫెండింగ్ ఛాంప్ హోదాలో బరిలోకి దిగుతోంది. ఈసారి సొంత ప్రేక్షకుల బలంతో ఈ హోదాను నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ, అదేం అంత సులభం కాదు. ఇక 2008లో శ్రీలంకపై ఉగ్ర దాడి తర్వాత చాలా ఏళ్ల పాటు ఆ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్లే జరగలేదు. పెద్ద జట్లు ఆ దేశ పర్యటనకు రావడానికి చాలా సమయమే పట్టింది.
ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో పెద్ద టోర్నీని నిర్వహిస్తోంది. ఇటీవల కాలంలో ద్వైపాక్షిక సిరీస్లు పకడ్బందీగా నిర్వహించడం వల్ల, ఆ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఐసీసీ పచ్చజెండా ఊపింది. అయినా సరే, భారత్ మాత్రం ఆ దేశానికి వెళ్లడానికి అంగీకరించలేదు. తన మ్యాచ్లను యూఏఈలో ఆడబోతోంది. అయితే టోర్నీని సమర్థంగా నిర్వహించి క్రికెట్ ప్రపంచానికి తామేంటో చాటాలని పాక్ పట్టుదలతో ఉంది. అయితే ఎలాంటి అపశ్రుతులూ దొర్లకుండా ఈ టోర్నీ పూర్తయితే భవిష్యత్తులో ఆ దేశంలో బహుళ దేశాల టోర్నీల నిర్వహణకు ఇబ్బంది ఉండదు. లేదంటే మాత్రం పాక్కు ఇబ్బందులు తప్పవు.
ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీ
ఇప్పటిదాకా 8సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. తొలిసారి 1998లో బంగ్లాదేశ్ వేదికగా టోర్నీని నిర్వహించారు. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన భారత్, 2013లో ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ సాధించింది. ఆస్ట్రేలియా కూడా రెండుసార్లు (2006, 2009) ఛాంపియన్ అయ్యింది. సౌతాఫ్రికా (1998), న్యూజిలాండ్ (2000), వెస్టిండీస్ (2004), పాకిస్థాన్ (2017) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.
Breakdown of a grand prize money pool for #ChampionsTrophy 2025 🏆
— ICC (@ICC) February 14, 2025
It’s All On The Line from February 19 🏏
More ➡️ https://t.co/cou1tEePD0 pic.twitter.com/QAturUtEYW
ఛాంపియన్స్ ట్రోఫీలో హైయ్యెస్ట్ రన్స్ బాదిన బ్యాటర్స్ - రోహిత్, విరాట్ ఏ ప్లేస్లో ఉన్నారంటే?
టీమ్ఇండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు - తొలగించాలంటూ ఫ్యాన్స్ డిమాండ్! - ఐసీసీ ఏం చెబుతోందంటే?