KTR Fire on CM Revanth Reddy About Rythu Bharosa : స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరని, ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో జరిగిన బీఆర్ఎస్ రైతుదీక్షలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ వారికి ఏమీ చేయలేదని, సొంత ఊరు, అత్తగారి ఊరు కల్వకుర్తిలో ఏమైనా చేశారా అని అడగడానికి ఇక్కడకు వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి తెలియదు : రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సోనియా పుట్టినరోజు రెండు సార్లు వచ్చినప్పటికీ రుణమాఫీ 25 శాతం కూడా కాలేదని కేటీఆర్ ఆరోపించారు. 35 సార్లు దిల్లీ విమానం ఎక్కారు తప్ప, 35 పైసలు కూడా తీసుకురాలేదని ఆయన ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి హయాంలో అప్పులు కట్టలేదని రైతుల తలుపులు, స్టార్టర్లు ఎత్తుకెళ్లారని అన్నారు. రేపో మాపో పుస్తెలతాడు కూడా లాక్కెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మోసం అత్తగారి ఊరు వాళ్లకు కూడా అర్థం అయిందని అన్నారు. రేవంత్ రెడ్డిది తప్పు కాదని, ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారని గతంలో చెప్పిన ఆయన అదే చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కులగణన అని రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, మళ్లీ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని సొంత భూముల విలువ పెంచుకునేందుకు డ్రామాలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి తెలియదని కేటీఆర్ విమర్శించారు. 600 కోట్లు ఇవ్వాల్సిన సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదని, పాడి రైతులకు కూడా బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు.
"35 సార్లు దిల్లీకి తిరిగిన రేవంత్రెడ్డి 35 పైసలు కూడా తేలేదు. రేవంత్ రెడ్డి హయాంలో అప్పులు కట్టలేదని రైతుల తలుపులు, స్టార్టర్లు ఎత్తుకెళ్లారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. రుణమాఫీ జరగలేదని సీఎం నియోజకవర్గం కొడంగల్లో రైతులు చెప్పారు."-కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అందరి జీవితాలు బాగుపడతాయి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలమూరుపై, ప్రజలపై ప్రేమ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం దిల్లీకి, విదేశాలకు వెళ్లేందుకు సమయం ఉంది కానీ, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై సమీక్షకు మాత్రం సమయం లేదని ఆక్షేపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్ రెడ్డి తరం కాదని అన్నారు. మూడెకరాలలోపు పది లక్షల ఎకరాలు తగ్గించి రైతుబంధు వేస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పాలమూరుకు నీళ్లు వచ్చాయన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టారు కానీ, డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నీ పోతాయని అన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అందరి జీవితాలు బాగుపడతాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.