Nepal Floods Landslides : నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 170కు చేరింది. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు, మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తి విలయం సృష్టించాయి. దీంతో ఇప్పటివరకు 170 మంది(NEPAL FLOODS DEATH TOLL) మరణించడంతో పాటు 42 మంది గల్లంతవ్వగా, 111 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దాదాపు 322 ఇళ్లు, 16 వంతెనలు కూడా దెబ్బతిన్నట్లుగా అధికారులు ప్రకటించారు.
కాగా, ఈ వరదల వల్ల అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్, కరెంట్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా సంభవిస్తోంది. ఈ భీకర వానలకు కఠ్మాండూ లోయ తీవ్రంగా ప్రభావితమైంది. భాగమతి నది అయితే ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. కాఠ్మండూలో అయితే ఈ స్థాయి వరదలు రావడం గత 45 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు, ఆర్మీ - ఇప్పటికే బస్సులు, వాహనాలు, ఇళ్లపై కొండ చరియలు విరిగిపడి శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు, బురద కింద ఇరుక్కున్న వాహనాలు, మృతదేహాలను వెలికితీసేందుకు నేపాల్ సైన్యం, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 20 వేల మందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందట. రంగంలోకి దిగిన పోలీసు, ఆర్మీ సహా ఇతర సహాయక సిబ్బంది వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది. ఇంకా వీలైనంత మంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారంతా ప్రయత్నిస్తున్నారు. అలాగే చాలా వరకు జాతీయ రహదారులను మూసివేశారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
బిహార్పై ప్రభావం పడే అవకాశం - ఈ నేపాల్ వరదల ప్రభావం బిహార్పై పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎందుకంటే అక్కడ నుంచి కొన్ని నదులు బిహార్లోకి ప్రవహిస్తాయి. కాబట్టి ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.