Tips to Avoid Stress in Students During Exams: ఫిబ్రవరి నుంచి మే వరకు పిల్లలకు పరీక్షా కాలం. సాధారణంగా ఎగ్జామ్స్ అంటేనే చాలా మంది పిల్లలు భయపడుతుంటారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ పరీక్షలంటే ఉన్న భయం పోదు. చదివింది గుర్తుండటం లేదని, పరీక్షలు రాసే సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందోనని ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే పరీక్షల వేళ పిల్లలు అటు పెద్దలు పరేషాన్ కాకుండా ఉండేందుకు ఈ టిప్స్ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇప్పటికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో స్టేట్ టెన్త్, ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో చదివింది గుర్తుపెట్టుకోవడం, ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కీలకం. ఏదిపడితే అది తింటే పరీక్షల వేళ అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టడం సరికాదని సూచిస్తున్నారు.
నిద్రపోకుండా చదవడం సరికాదు: ఎగ్జామ్స్ అంటే చాలా మంది విద్యార్థులు తిండి, నిద్ర మానేసి టైమ్తో పనిలేకుండా చదువుతుంటారు. ఎంత ఎక్కువ చదివితే అన్ని మంచి మార్కులు వస్తాయనే భావనలో ఉంటారు. అయితే ఇలా తిండి, నిద్ర మానేసి చదవడం మంచిది కాదని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో సైకియాట్రిస్టు డాక్టర్ అనిత అంటున్నారు.
- టైం టేబుల్ పెట్టుకొని ప్రతి సబ్జెక్టు కొంత సమయం చదువుకుంటూ పోవాలని, ఏకధాటిగా పుస్తకాలతో కుస్తీ పట్టకుండా మధ్య మధ్యలో కాస్తంత విశ్రాంతి తీసుకోవడం అవసరమంటున్నారు.
- రాత్రి మొత్తం చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, చదివింది మెదడుకు ఎక్కదని, ఫలితంగా అనవసర ఆందోళనకు కారణమవుతుందని అంటున్నారు. కాబట్టి రోజూ కనీసం 7-8 గంటలపాటు నిద్ర తప్పనిసరని సూచిస్తున్నారు.
- ఎంత ప్రణాళిక వేసుకున్నా సరే కొందరికి పరీక్షలంటే భయం. ఇలాంటి వారితో పెద్దలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచిస్తున్నారు.
ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు: ఎగ్జామ్స్ టైమ్లో చాలా మంది ఫుడ్ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. చదువులో పడి ఆయిల్, జంక్ ఫుడ్స్ను విపరీతంగా తీసుకుంటారు. అయితే పరీక్షల సమయంలో పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జాతీయ పోషకాహార సంస్థ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య అంటున్నారు.
- పరీక్షల సమయంలో పిల్లలకు ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఆహారం ఇవ్వకూడదని, బయట నుంచి ఆహారం పూర్తిగా తగ్గించాలని సూచిస్తున్నారు.
- పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ఇవ్వాలి. చిరు ధాన్యాలతో చేసిన పోహా, రాగి దోశ, ఇడ్లీ, ఓట్స్, పండ్ల ముక్కలు, గుడ్డు, పాలు అందించాలని సలహా ఇస్తున్నారు.
- నిద్ర రాకుండా రాత్రిళ్లు కాఫీలు, టీలు ఎక్కువ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి తీయొచ్చు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
- ఎగ్జామ్స్ టైమ్లో ఎండలు పెరగడంతో శరీరం డీహైడ్రేషన్కు గురై తలనొప్పి, నీరసం, వాంతులు వాటితో పరీక్షలు సక్రమంగా రాయలేరు. కాబట్టి రోజూ తప్పనిసరిగా 7-8 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
పదో తరగతి విద్యార్థులు కాస్త శ్రద్ధ పెడితే చాలు - ఆ సబ్జెక్ట్లో మంచి మార్కులు మీ సొంతం!