Longest Railway Tunnel In India : దేశంలో అతిపెద్ద రైలు టన్నెల్ T-50 ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్లో U.S.B.R.L ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బనిహాల్- ఖడీ- సుంబడ్- సంగల్దాన్ సెక్షన్ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ మార్గంలోనే ఖడీ- సుంబడ్ల మధ్య T-50 సొరంగం ఉంటుంది. దీని పొడవు 12.77 కిలోమీటర్లు.
48.1కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగం పనులు UPA ప్రభుత్వ హయాంలో 2010లోనే పనులు ప్రారంభం కాగా దాదాపు 14 ఏళ్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. బనిహాల్- సంగల్దాన్ సెక్షన్లోని 11 సొరంగాల్లో ఇదే అత్యంత సవాల్గా నిలిచిందని అధికారులు తెలిపారు. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు T-50కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించినట్టు పేర్కొన్నారు. ప్రతీ 375 మీటర్ల దూరంలో ఈ రెండింటినీ కలుపుతూ మార్గాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
రూ.41 వేల కోట్ల వ్యయంతో
U.S.B.R.L ప్రాజెక్టును 41 వేల కోట్ల రూపాయలతో చేపట్టారు. మొత్తం పొడవు 272 కిలోమీటర్లు కాగా బారాముల్లా- సంగల్దాన్, ఉధంపుర్- కాట్రా సెక్షన్ల మధ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాట్రా- సంగల్దాన్ మధ్య 63 కిలోమీటర్ల మేర పనులు సాగుతున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ వంతెన, దేశంలో తొలి తీగల రైలు వంతెన "అంజీఖాడ్ " ఈ మార్గంలోనే ఉన్నాయి. తాజాగా బనిహాల్- సంగల్దాన్ సెక్షన్ ప్రారంభం కావడంతో కశ్మీర్ లోయ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలనే లక్ష్యానికి మరింత చేరువైనట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా కశ్మీర్ లోయలో తొలిసారి రెండు విద్యుత్తు రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. అందులో ఒకటి శ్రీనగర్-సంగల్దాన్, మరొకటి సంగల్దాన్-శ్రీనగర్ విద్యుత్తు రైళ్లు ఉన్నాయి. అంతకుముందు విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించారు. 'దేశవ్యాప్తంగా నూతన విమానాశ్రయాలు నిర్మాణం జరుగుతున్నాయి. ఈ రోజు జమ్ము కశ్మీర్లో కూడా విమానాశ్రయ విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గం ద్వారా మరో ముందడుగు పడిందని' ప్రధాని మోదీ పేర్కొన్నారు.
'జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధాన అడ్డంకి- దానిపై సినిమా రావడం మంచి విషయం'
'లోక్సభ ఎన్నికలు మహాభారతం యుద్ధం లాంటివి- మళ్లీ మోదీ ప్రధాని అవ్వడం పక్కా!'