'యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి'- నెతన్యాహుతో భేటీ వేళ ట్రంప్ కీలక కామెంట్స్
Published : Jul 26, 2024, 7:37 AM IST
Trump Netanyahu Meet : హమాస్తో జరుగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్ వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో శుక్రవారం భేటీ కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా కాంగ్రెస్లో నెతన్యాహు ప్రసంగాన్ని నిరసించిన వారిపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. మరోవైపు "సేవ్ అమెరికా" పేరుతో కొత్త పుస్తకాన్ని ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే తాను రాసిన రెండు పుస్తకాలు "అవర్ జర్నీ టుగెదర్”, "లెటర్స్ టు ట్రంప్" విశేష ఆదరణ పొందాయన్న ఆయన, ఈ పుస్తకం అన్నికంటే గొప్పదన్నారు. అమెరికా ప్రజలు ప్రస్తుతం విఫల దేశంలో జీవిస్తున్నారని, కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని తెలిపారు. త్వరలోనే అమెరికాను మళ్లీ గొప్పదేశంగా చేస్తానంటూ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పేర్కొన్నారు.