కూలీకి దొరికిన భారీ డైమండ్- రూ.250 పెట్టుబడితో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా!
Published : Jul 25, 2024, 1:01 PM IST
Farmer Finds Diamond In Panna :ఓ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!. కృష్ణ కల్యాణపుర్కు చెందిన రాజు గౌడ్ అనే కార్మికుడు డైమండ్ల కోసం వెతకడానికి, తవ్వడానికి రూ.250తో పర్మిషన్ తీసుకున్న గనిలో బుధవారం 19.22 క్యారెట్ల డైమండ్ దొరికింది. వెంటనే ఆ వజ్రాన్ని పన్నా డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో దీనిని ఉంచుతామని జిల్లా కలెక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. వేలంలో ఈ వజ్రం సుమారు రూ.80 లక్షల వరకు పలుకుతుందని, రూ.కోటికి పైగా కూడా వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు. కాగా, వజ్రం వేలం ద్వారా వచ్చిన సొమ్మును తన పిల్లల చదువు, ఆర్థిక కష్టాలు తీర్చుకోవడానికి వాడుతానని కార్మికుడు రాజు గౌడ్ తెలిపాడు. దీంతో కార్మికుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.