ఏలూరు జిల్లాలో వింత జంతువు పాదముద్రలు - పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు - Unidentified animal footprints - UNIDENTIFIED ANIMAL FOOTPRINTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 16, 2024, 9:53 PM IST
Unidentified Animal Footprints in Eluru District : ఏలూరు జిల్లాలో గుర్తుతెలియని వింత జంతువు పాదముద్రలు కలకలం రేపాయి. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్టుగూడెం సమీపంలో ఈ పాదముద్రలు బయటపడటంతో స్థానికులు భయందోళనకు గురౌతున్నారు. పుట్లగట్టుగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో పారేపల్లి కొండబాబు అనే రైతు తన తోటలో గుర్తుతెలియని వింత జంతువు పాదముద్రలు గుర్తించాడు. ఆ పాదముద్రలను చూసిన కొండబాబు తీవ్ర భయందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని అందించారు.
అయితే రెండు నెలల క్రితం బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల, దెందులూరు మండల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. తాజాగా తమ ప్రాంతంలో వింత జంతువు పాదముద్రలు చూసి రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటన స్థాలానికి చేరుకున్న అధికారులు ఆ వింత పాదముద్రలను పరిశీలించారు. అనంతరం ఆ పాదముద్రలు క్రూర జంతువులవి కాదని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.