Couple Facing Financial Difficulties to Feed Their Disabled Children in Palnadu Ditrict : పుట్టుకతోనే సమస్యతో పుట్టాడని కన్న తల్లిదండ్రులే ఆ పసిగుడ్డును సజీవ సమాధి చెయ్యడానికి ప్రయత్నించారు. ఆర్థిక ఇబ్బందులకు బయపడి నవ మాసాలు మోసిన బిడ్డను అంగడి సరకు చేసిన తల్లులున్నారు. ఇటువంటి ఘటనలు మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ పల్నాడు జిల్లాలోని ఓ వృద్ధ జంట ఇటువంటి వారికి పూర్తి భిన్నం. చిన్నప్పటి నుంచి పలు ఆనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన నలుగురు కుమారులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కన్నవారిని, కడుపున పుట్టిన వారిని భారమనుకుని కడతేర్చే కర్కశులకు ఈ దంపతులు కనువిప్పు. కానీ ఇప్పుడు వారు తమ పిల్లలను పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ఇప్పటికీ చంటి బిడ్డలే : ఆ ఇంట నలుగురు వ్యక్తులు పుట్టుక నుంచే మంచానికి పరిమితం అయ్యారు. వారికి యాభై ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ చంటి బిడ్డలే, ఆకలేస్తే నోరు తెరిచి అన్నం అడగలేని పరిస్థితి వారిది. ఇప్పటికీ తల్లిదండ్రులే వారి ఆలనాపాలనా చూస్తున్నారు. ప్రస్తుతం వారు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు తలుచుకొని తల్లడిల్లుతున్నారు. పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంతకు చెందిన దూళిపాళ్ల రామయ్య, వెంగమ్మ దంపతులకు ఆరుగురు సంతానం.
వారిలో నలుగురు పేరయ్య, సీతయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు పుట్టుకతోనే నయం కాని వ్యాధితో మంచాన పడ్డారు. ప్రస్తుతం వారి వయసు 50 ఏళ్లకు పైపడింది. వయోభారంతో బాధపడుతున్నా తల్లిదండ్రులే తమ కుమారులను చూసుకుంటున్నారు. మొన్నటివరకు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు.
భార్య పోరు పడలేక కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు
ఇప్పుడు వృద్ధాప్యంతో ఏ పనులూ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఆ కుటుంబంపై కరుణ చూపి, ముగ్గురికి పింఛన్లు మంజూరు చేశారు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక ఒకరికి మాత్రమే పింఛన్ను పరిమితం చేసింది. మంచానికే పరిమితమైన తమ నలుగురు కుమారులకు కనీసం పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
బతికుండగానే పూడ్చి పెట్టే ప్రయత్నం - గుక్కపట్టి ఏడ్చిన పసిగుడ్డు, అంతలోనే?