Published : 5 hours ago
పులిచింతల ప్రాజెక్టు బ్రిడ్జిపై మొసలి కలకలం - CROCODILE AT PULICHINTALA PROJECT
Crocodile at Pulichintala Project: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుపై ఒక మొసలి ప్రత్యక్షం అయ్యింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల పులిచింతల రిజర్వాయర్లోకి వరదనీటితో పాటు మొసళ్లు భారీ సంఖ్యలో వచ్చి చేరాయి. రాత్రి సమయంలో ప్రాజెక్టు బ్రిడ్జిపై మొసలి కనిపించింది. ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రాకు ప్రాజెక్ట్పై నుంచి వెళ్లే ప్రయాణికులు మొసలిని చూసి భయబ్రాంతులకు గురై వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు.
మొసలి కొద్ది సేపటి తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్లడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొసలి ప్రాజెక్ట్ 3వ నెంబర్ గేట్ ద్వారా బ్రిడ్జి పైకి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. మొసళ్ల నుంచి ప్రజలకు ఎప్పుడైనా ప్రమాదమేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న వ్యవసాయ పొలాల్లోకి అప్పుడప్పుడు మొసళ్లు కూడా వస్తున్నాయి. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతంలో మొసళ్ల సంచారంపై స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.