రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు - డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సేఫ్ - Bus Stuck Railway Under Bridge - BUS STUCK RAILWAY UNDER BRIDGE
Published : Aug 19, 2024, 5:36 PM IST
Bus Stuck Railway Under Bridge In Nizamabad : నిజామాబాద్లోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సు ముందుకు కదల్లేక, వెనక్కి వెళ్లలేక అక్కడే ఇరుక్కుపోయింది. వరంగల్ నుంచి నిజామాబాద్కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులోకి నీరు చేరడంతో అప్రమత్తమైన డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ముందుగా ప్రయాణికులను, ఆ తర్వాత బస్సును సురక్షితంగా బయటకు తీశారు. తృటిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిజామాబాద్లో భారీ వర్షం పడటంతో రహదారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు, వరద నీటిని తొలిగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తున్నారు.