By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 7:12 PM IST
అక్రమాలను ప్రశ్నించినందుకే తప్పించారు: ఆనం రామనారాయణరెడ్డి
Anam Ramanarayana Reddy: మైనింగ్ దగ్గర నుంచీ అంతా మాఫియాగా మారిందని ప్రశ్నించినందుకే తనను వైఎస్సార్సీపీ నుంచి తప్పించారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. అనర్హత నోటీసుపై స్పీకర్ వ్యక్తిగత విచారణకు హాజరయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చీఫ్ విప్ పెట్టిన సాక్ష్యాధారాలు ఏవీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం విలువైనవి కావని స్పష్టం చేశారు. పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తకు గుర్తింపు ఉండదనే అంశంపై పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు తీర్పులు సైతం ఉన్నాయని తెలిపారు. ఇదే అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. చీఫ్ విప్ చూపించిన ఆధారాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలన్నారు.
వైఎస్సార్సీపీ నుంచీ తాను తప్పుకోలేదని, తప్పించిన తరువాతే తాను బయటకొచ్చానని చెప్పారు. వైఎస్సార్సీపీ రాజకీయ స్వార్ధం కోసం స్పీకర్ స్ధానాన్ని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనర్హత వేటు విషయంలో జరుగుతున్న దానిని స్పీకర్కు మాత్రమే ఆపాదించలేమని చెప్పారు. చివరి రోజు అసెంబ్లీ వరకూ ఉన్నాననే తృప్తి ఉందన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై వేచి చూస్తున్నట్లు ఆనం పేర్కొన్నారు.