IIT Madras And ISRO: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)తో జతకట్టింది. ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్లో పరిశోధనల కోసం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను స్థాపించేందుకు ఐఐటీ మద్రాస్.. ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ సెంటర్ ఏర్పాటు కోసం ఇస్రో 1.84 కోట్ల సీడ్ ఫండింగ్ను రిలీజ్ చేసినట్లు తెలిపింది.
ఐఐటీ మద్రాస్ తెలిపిన సమాచారం ప్రకారం.. 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఇస్రోకు మేజర్ పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. అంతరిక్ష నౌక, ఎగిరే వాహనాల ఉష్ణోగ్రత నిర్వహణను అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఐఐటీ మద్రాస్ ఫ్యాకల్టీ వారి నైపుణ్యంతో థర్మల్ యూనిట్స్ రూపకల్పన, విశ్లేషణ, టెస్టింగ్లో సహకారం అందిస్తారు. ఈ మేరకు 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' స్థాపనపై అవగాహన ఒప్పందంపై రెండు సంస్థల ప్రతినిధులు సోమవారం సంతకాలు చేశారు. ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
దీని లక్ష్యం ఏంటంటే?:స్పేస్క్రాఫ్ట్, లాంచ్ వెహికల్స్కు సంబంధించిన థర్మల్ సవాళ్లను పరిష్కరించడమే ఈ సెంటర్ లక్ష్యం. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, పరికరాలు, భవిష్యత్తు పరిశోధన అవసరాల కోసం ఇస్రో తొలుత రూ.1.84 కోట్లను రిలీజ్ చేసింది. ఈ సెంటర్ స్పేస్క్రాఫ్ట్ థర్మల్ మేనేజ్మెంట్, హైబ్రిడ్ రాకెట్స్లో దహన అస్థిరత, క్రయోజెనిక్ ట్యాంక్ థర్మోడైనమిక్స్ వంటి వాటి ఉష్ణోగ్రత నిర్వహణపై దృష్టి సారిస్తుంది.
ఇండస్ట్రీ- అకాడెమియా సహకారం:ఈ సెంటర్ ఇస్రో సైంటిస్టులు, ఐఐటీ మద్రాస్ అధ్యాపకుల మధ్య గొప్ప సహకారాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్ల్యూయిడ్ అండ్ థర్మల్ సైన్స్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు, ఐఐటీ మద్రాస్ అధ్యాపకులతో పాటు విద్యార్థులు థర్మల్ సైన్స్లోని క్లిష్టమైన రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది వీలు కల్పిస్తుంది.