Govt Takes Strong View Of Google Delisting Apps From Play Store :గూగుల్ కంపెనీ భారతదేశంలోని ప్లేస్టోర్ నుంచి కొన్ని యాప్లను తొలగించడంపై టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చే వారం గూగుల్, టెక్ స్టార్టప్ కంపెనీలతో సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
యాప్లను తొలగిస్తున్న గూగుల్
ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ గూగుల్, సర్వీస్ ఫీజు చెల్లించని యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగించడం ప్రారంభించింది. తమ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ, భారత్కు చెందిన కొన్ని కంపెనీలు సర్వీస్ ఫీజు చెల్లించడం లేదని కంపెనీ ఆరోపించింది. కానీ సదరు కంపెనీల పేర్లు మాత్రం బయటకు చెప్పలేదు. అయితే వీటిలో షాదీ, మాట్రిమోనీ, భారత్ మాట్రిమోనీ, ఆల్ట్ (ఆల్ట్ బాలాజీ), ఆడియా ప్లాట్ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ యాప్ క్వాక్క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ లాంటి యాప్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇవి ఏవీ గూగుల్ ప్లే స్టోర్లో కనిపించకపోవడం గమనార్హం.
ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయా?
గూగుల్ కంపెనీ ప్లేస్టోర్లోని యాప్లపై 15 శాతం నుంచి 30 శాతం వరకు సర్వీస్ ఛార్జీ వసూలు చేసేది. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలతో, గూగుల్ ఈ ఫీజులను 11%-26% వరకు తగ్గించింది. అయితే ఫీజులు తగ్గించినప్పటికీ చాలా యాప్లు సర్వీస్ ఫీజు చెల్లించడం లేదని గూగుల్ పేర్కొంది.