Threat to Olive Ridley Turtles: ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి సముద్ర తాబేళ్ల మరణాలు ఆగడం లేదు. ఒక్క జనవరి నెలలోనే ఏపీ తీరం వెంబడి 3,085 తాబేళ్ల కళేబరాలను గుర్తించినట్లు చెన్నై వేదికగా పనిచేస్తున్న ‘ట్రీ ఫౌండేషన్’ తన సర్వేలో పేర్కొంది. ఈ లెక్కలు కేవలం తీరానికి కొట్టుకువచ్చిన తాబేళ్లవి మాత్రమే. సంద్రంలోనే కలిసిపోయినవి మరెన్నో ఉండొచ్చు! ట్రీ ఫౌండేషన్ సంస్థ 2008 నుంచి ఏపీ ప్రభుత్వంతో కలిసి తాబేళ్ల సంరక్షణకు పనిచేస్తోంది.
అయితే ఈ మధ్యకాలంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తాబేళ్లు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండటంతో ఓ సర్వే నిర్వహించింది. ఏటా ఈ సీజన్లో కొన్ని తాబేళ్లు మృతిచెందడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి మాత్రం దాని తీవ్రత ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఏపీ తీర జిల్లాల్లో పెద్దఎత్తున వందల తాబేళ్ల కళేబరాల్ని గుర్తించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తాబేళ్లు సముద్ర జలాల అడుగున ఉంటున్నప్పటికీ, అవి 40 నిమిషాలకోసారి శ్వాసతీసుకునేందుకు ఉపరితలానికి వస్తుంటాయని తెలిపారు.
ఇలా వచ్చి తిరిగి వెళ్లే సమయంలో మత్స్యకారుల వలలకు, మోటారు బోట్లకు, మరికొన్ని కాలుష్యం కారణంగా మృతి చెందుతున్నాయని వెల్లడించారు. డిసెంబరు నుంచి మార్చి నెలల మధ్య గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు సముద్ర తీరానికి వస్తుంటాయని, అవి పెట్టిన గుడ్లు పిల్ల దశకు రావడానికి 48 నుంచి 60 రోజుల సమయం పడుతుందని అన్నారు. ఈ ప్రక్రియ కోసం వచ్చే తాబేళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతున్నాయని తెలిపారు.