తెలంగాణ

telangana

తెలంగాణ ప్రజలకు బిగ్​ అలర్ట్ - ఇక నుంచి ప్రతి నెలా ఆస్తి పన్ను కట్టాల్సిందే! - Property Tax Every Month in Tg

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 9:52 AM IST

Updated : Sep 15, 2024, 9:57 AM IST

Every Month Property Tax : తెలంగాణ ప్రజలకు కీలక అలర్ట్​. ఇప్పటివరకు ఆస్తి పన్నును ఏడాదికి ఒకసారి కట్టేవారు. కానీ ఇప్పటి నుంచి ఆ ఆస్తి పన్నును నెలనెలా కట్టాల్సి ఉంటుంది! ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Every Month Property Tax
Every Month Property Tax (ETV Bharat)

Property Tax Every Month in Telangana : ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న రుసుములు, పన్నులను సరళీకృతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వారిపై ఆర్థిక భారం పడకుండా, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణకు నడుంబిగించింది. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను తాజాగా జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో పురపాలక, ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు ప్రారంభించాయి. విద్యుత్తు ఛార్జీలు, నల్లా బిల్లుల మాదిరే ఆస్తిపన్నును కూడా నెలవారీ వసూలు చేయడం, పన్ను విలువను వాస్తవీకరణ చేయడమే ముఖ్యోద్దేశమని అధికారులు చెబుతున్నారు.

నిబంధనను సవరించి :హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలలకోసారి ప్రభుత్వం ఆస్తిపన్ను విధిస్తుండగా, ఏడాదికోసారి చెల్లిస్తున్నారు. పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీ చట్టంలోని ఆ నిబంధనను సవరించి నెలకోసారి ఆస్తి పన్ను విధించాలనే ఆలోచన అధికార వర్గాల్లో ఉంది. రోజువారీ చేపట్టే ఇంటింటి చెత్త సేకరణ రుసుము కొన్ని కాలనీల్లో రూ.50 ఉండగా, మరికొన్నిచోట్ల రూ.100 నుంచి రూ.150 వరకు ఉంది. అయినా నిత్యం చెత్త సేకరణ జరగట్లేదనే ఫిర్యాదులు ఉన్నాయి.

చెత్త సేకరణను మెరుగుపరచడం, రుసుమును నియంత్రించడంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. జీహెచ్‌ఎంసీకి పలు విభాగాలనుంచి ఆదాయం వస్తుంటుంది. వాటిని నిర్ధారించడంలో లోపాల కారణంగా బల్దియా ఏటా రూ.కోట్లు నష్టపోతోంది. నిర్మాణాలకు రూ.1,200లోపు ఆస్తి పన్ను ఉంటే రూ.101 మాత్రమే చెల్లిస్తే చాలంటూ గత సర్కారు తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో దుర్వినియోగమవుతోంది. లోపాలను చక్కదిద్ది ఆదాయాన్ని పెంచుకోవాలని తాజాగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలిని సీఎం ఆదేశించారు.

చెల్లింపులన్నీ ఒకే వేదికపైకి తేవాలి : మరోవైపు జలమండలి తాగునీటికి ప్రతినెలా బిల్లును వసూలు చేస్తోంది. నెలకు 20 వేల లీటర్ల తాగునీటిని ఉపయోగించుకునే ఇళ్లకు ఉచిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే విద్యుత్​కు సంబంధించి నెలకు 200 యూనిట్లలోపు వినియోగించుకుంటున్న ఇళ్లకు ఉచిత విద్యుత్తు పథకం అమలు అవుతోంది. ఇందుకు ప్రతినెలా కరెంటు బిల్లు వస్తోంది. అదేవిధంగా పైపు లైను ద్వారా వంట గ్యాస్​ను సరఫరా చేసినా దాన్ని నెలవారీగా వసూలు చేయవచ్చని బల్దియా ఆలోచిస్తోంది. యూపీఐ ద్వారా రుసుముల చెల్లింపు విధానాలను మరింత సరళీకరించడంతోపాటు అన్ని చెల్లింపులు ఒకే వేదిక ద్వారా జరగాలని, ఆ సదుపాయాలను అందుబాటులోకి తేవాలని అధికార యంత్రాంగానికి సీఎం సూచనలు చేశారు.

సక్రమంగా పన్నులు కట్టేవారికి బహుమతులు, ప్రోత్సాహకాలు : గడువులోగా అన్ని బిల్లులు, పన్నులు కట్టిన వారికి బహుమతులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం సూచించారు. ఇప్పుడు గడువులోగా కరెంటు బిల్లు చెల్లించకుంటే అధికారులు సరఫరాను ఆపేస్తారు. అలాంటి చర్యలకు పోకుండా ఇక నుంచి ఇలాంటి ప్రోత్సాహకాలు పెడితే ఎవరూ పన్నులు, బిల్లులు ఎగ్గొట్టరని సీఎం తెలిపారు. బహుమతులు లేదా ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రాయితీ వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు సీఎం చెప్పారు.

మెరుగైన సేవలందించేందుకే జీఐఎస్ సర్వే - జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి క్లారిటీ - Amrapali On GHMC GIS Survey

'తప్పుడు క్లెయిమ్​లు నమోదు చేసి పన్ను ఎగ్గొట్టాలని చూస్తే ఎప్పటికైనా చర్యలు తప్పవు' - Awareness on Income Tax

Last Updated : Sep 15, 2024, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details