తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ పిల్లలు రోడ్డు దాటేటప్పుడు భద్రమేనా? - SCHOOL CHILDREN SAFETY ON ROADS

ట్రాఫిక్ పార్కుల ద్వారా విద్యార్థుల్లో అవగాహన - రోజురోజుకీ పెరుగుతున్న విద్యార్థుల రోడ్డు ప్రమాదాలు - కీలక నిర్ణయం తీసుకున్న రవాణాశాఖ

School Children Safety on Roads
School Children Safety on Roads (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2025, 10:54 PM IST

School Children Safety on Roads : బడికి వెళ్లే బస్సు, దిగే క్రమంలో రోడ్లు దాటే సమయంలో, సైకిళ్లపై, నడుచుకుంటూ వెళ్లేటప్పుడు, ఇతర వాహనాల్లో వెళ్తున్న సమయంలో విద్యార్థులు ప్రమాదబారిన పడుతున్నారు. బడిలో పాఠాలు నేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన వారు ఇలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఏటా ఇలాంటి ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తుండగా, వేల సంఖ్యలో గాయపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2023లో 18 ఏళ్లలోపు పిల్లలు 300 మంది మరణించారు. అలాగే 1,175 మంది గాయపడ్డారు. ఇందులో 18-25లోపు వారు 1,115 మంది మరణించగా, 3,564 మంది గాయపడ్డారు. ఏకంగా 2023లో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 7,600 మంది మరణిస్తే అందులో 1,415(18.61శాతం) పాతికేళ్ల లోపువారే ఉన్నారు. వీరిలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారే ఎక్కువగా ఉంటారని అధికారులు చెబుతున్నారు.

విద్యాసంస్థల బయట 35 వేల ప్రమాదాలు :

  • ప్రపంచంలోనే భారతదేశం రోడ్డు ప్రమాద మరణాల్లో అధికం. రోజూ దాదాపు 400 మంది మరణిస్తున్నారు.
  • ప్రపంచంలోనే మొత్తం వాహనాల్లో దేశంలో ఉన్నవి కేవలం ఒక్క శాతమే. కానీ రహదారి ప్రమాద మరణాల్లో మన వాటా 11 శాతం.
  • దేశంలో రహదారి ప్రమాద్లో నిత్యం సగటున 42 మంది చిన్నారులు మరణిస్తున్నారు.
  • 31 మంది 18,25 యువతీయువకులు చనిపోతున్నారు.
  • 2023లో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బయట 35 వేల ప్రమాదాలు జరిగాయి. అందులో 10 వేల మంది పిల్లలు మరణించారు.
  • రహదారి ప్రమాదాల్లో తెలంగాణ దేశంలో తొలి 10 స్థానాల్లో ఉండగా, 2023లో 21,619 రహదారి ప్రమాదాలు జరిగాయి.

30 జిల్లాల్లోని 50 పాఠశాలల్లో ట్రాఫిక్‌ పార్కులు : రహదారుల ప్రమాదాలను నియంత్రించడానికి ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలి దశలో 30 జిల్లాల్లోని 50 పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్​నెస్ పార్కులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జిల్లాల వారీగా పాఠశాలల్ని గుర్తించి, వాటిలో ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేసి రహదారి భద్రతా పాఠాల్ని విద్యార్థులకు నేర్పించనున్నారు.

ఇలా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్​లో ఏర్పాటు చేసిన ఈ పార్కును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రవాణాశాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. తొలుత జిల్లాకు ఒకరిద్దరు అధికారులకు శిక్షణ ఇప్పించి, వారి ద్వారా ఆయా జిల్లాల్లో విద్యార్థులకు రహదారి భద్రత పాఠాలు నేర్పించనున్నారు. ఈ పార్కులు ఉన్న పాఠశాల విద్యార్థులకే కాకుండా సమీపంలోని ఒక్కో స్కూల్​కు ఒక్కో రోజు స్లాట్ బుక్ చేసి అనుమతి ఇవ్వనున్నారు.

జాగ్రత్తలు చెబుతాం, నిబంధనలు వివరిస్తాం : ట్రాఫిక్ అవేర్​ననెస్ పార్కుల్లో నేలపై ఫ్లోరింగ్ చేసి రోడ్డులా డిజైన్ చేసి జీబ్రా లైన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేశ్ తెలిపారు. రోడ్డు ఎప్పుడు, ఎలా దాటాలో చూపిస్తామన్నారు. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. దీంతో పాఠశాలకు సురక్షితంగా వెళ్లిరావడమే కాకుండా తల్లిదండ్రులతో వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ హెల్మెట్, సీటుబెల్ట్ పెట్టుకునేలా జాగ్రత్తలుు తీసుకుంటామన్నారు. ఎల్​కేజీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాల్లో బాధితులైన పిల్లల సంఖ్య పెరిగినట్లు ప్రాథమిక సమాచారం.

రోడ్డు ప్రమాదాల వల్ల తమ ప్రాణాలే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు కారకులవుతున్నారు : మహేశ్​ భగవత్

మూడేళ్ల చిన్నారిని ఢీకొన్న కారు.. అక్కడికక్కడే..

ABOUT THE AUTHOR

...view details