తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 7:19 AM IST

ETV Bharat / state

6 గ్యారంటీల్లో మరో కీలక అడుగు - ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్​ పథకాలకు నేడు సీఎం శ్రీకారం

Free Power And Gas Cylinder Scheme : ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో రెండు పథకాలకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు. చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో సచివాలయంలో మొదలుపెట్టాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఆ రెండు పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం చేవెళ్లలో జరిగే సభలో పార్టీ అగ్రనేత ప్రియాంక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొననున్నారు.

Free Power And Gas Cylinder Scheme  Inauguration Today
Free Power And Gas Cylinder Scheme

Free Power And Gas Cylinder Scheme

Free Power And Gas Cylinder Scheme Inauguration Today: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో నేడు మరో కీలక అడుగు పడనుంది. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేస్తుండగా, ఇవాళ మరో రెండింటికి శ్రీకారం చుట్టనున్నారు. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహాలక్ష్మిలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మధ్యాహ్నం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

చేవెళ్లలో వాటిని ప్రారంభించాలని తొలుత భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చారు. చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దు కావడంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు - వర్చువల్​గా 2 పథకాల ప్రారంభానికి ఏర్పాట్లు

Free Power Gas Cylinder Scheme :ఆరు గ్యారెంటీల పేరిట 13 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు హామీలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తోంది. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వనుంది. విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా ఆ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు పథకాన్ని వర్తింపచేయనుంది.

మీటర్ రీడింగ్‌కు వెళ్లినప్పుడు దరఖాస్తుదారుల ఆధార్, తెల్లరేషన్ కార్డులను విద్యుత్ సిబ్బంది పరిశీలించారు. అయితే కొన్నిచోట్ల ఇంకా పరిశీలన పూర్తి కాలేదు. ఎంపికైన లబ్ధిదారులకు మార్చిలో జీరో విద్యుత్ బిల్లు ఇవ్వనున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల మందిని ఆ పథకానికి ఎంపిక చేశారు. లబ్ధిదారులు తొలుత పూర్తి ధర చెల్లించి, గ్యాస్ సిలిండర్ పొందాలి. తర్వాత రూ.500 పోగా మిగిలిన సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్‌ కంపెనీలకు అందించింది.

Gas Cylinder Scheme in Telangana : మరోవైపు కాంగ్రెస్‌ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించినందున సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారినీ మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్‌ చేసేందుకు రెడీ అవుతుంది. అందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

గత పదేళ్లలో కేసీఆర్‌ వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారు : సీఎం రేవంత్

సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details