తెలంగాణ

telangana

కార్గో లాజిస్టిక్స్​పై దృష్టి సారించిన టీఎస్​ఆర్టీసీ - అత్యాధునిక సేవలు విస్తరించేలా ప్రణాళికలు

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 7:48 PM IST

Special Story on TSRTC Cargo Services in Telangana : టీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్‌ విభాగ నెట్‌వర్క్​ను మరింతగా విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి, ఆకర్షణీయమైన మోడల్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సులు తిరిగే ప్రతి ప్రాంతానికి లాజిస్టిక్స్ సేవలు విస్తరించాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ కార్గోతో పోల్చితే ఆర్టీసీ అత్యంత సురక్షితంగా, వేగంగా పార్సిళ్లను చేరవేస్తుందని యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తుంది. ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలపై ప్రత్యేక కథనం.

TSRTC on Cargo Services in Telangana
Special Story on TSRTC Cargo Services in Telangana

Special Story on TSRTC Cargo Services in Telangana : ఆర్టీసీ సంస్థ అంటే ప్రజల్లో నమ్మకం, విశ్వాసం ఉంది. సంస్థకు ప్రజలపై ఉన్న అపారమైన నమ్మకాన్ని కొనసాగించేందుకు లాజిస్టిక్స్ విభాగాన్ని మరింత విస్తరించాలని యాజమాన్యం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కార్గో విస్తరించింది. దానికి మరింత సాంకేతికత జోడించి, వేగంగా సేవలు అందించాలని సంస్థ నిర్ణయించింది. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్సిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ (TSRTC Cargo Pickup and Delivery) చేయాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో పార్సిళ్ల పికప్, డెలివరీని అందుబాటులోకి తీసుకువచ్చి, త్వరలోనే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని యాజమాన్యం ప్రణాళికలు వేస్తోంది.

TSRTC on Cargo Services in Telangana : ఆర్టీసీ సంస్థకు టికెట్ ఆదాయం 97 శాతం వస్తుండగా టికెటేతర ఆదాయం కేవలం 3 శాతం మాత్రమే వస్తోంది. అందుకే ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. అందులో భాగంగా ప్రైవేట్‌ మార్కెట్‌కు దీటుగా లాజిస్టిక్స్‌ విభాగాన్ని బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది. రాష్ట్రంలో చాలా గ్రామాల్లోకి ఆర్టీసీ బస్సులు వెళుతుంటాయి. దీంతో పార్సిళ్లు చేరవేయడం చాలా సులభం. ఏ రోజు పార్సిళ్లు అదేరోజు చేరవేసే వెసులుబాటు ఉంది. అద్భుతమైన, నమ్మకమైన సిబ్బందిని ఆర్టీసీ కలిగి ఉంది. అన్నింటికి మించి ఆర్టీసీ అంటే ప్రజల్లో నమ్మకం ఉంది. ఇంకేముంది, లాజిస్టిక్స్ విస్తరణకు ఇంతకంటే కావాల్సింది ఏముంది అని ఆర్టీసీ అధికారులు అనుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్గోనే మరింత విస్తరించాలని నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల్లో, ఆంధ్రప్రదేశ్(Andra Pradesh), కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు పార్సిళ్లను చేరవేయాలంటే 48 గంటల్లో చేరవేస్తామనే గ్యారంటీనీ ఆర్టీసీ కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ 490కి పైగా బుకింగ్ కౌంటర్లను, 9,000లకు పైగా పార్సిల్ రవాణా వాహనాలను, 190కి పైగా నాలుగు టన్నుల నుంచి 10 టన్నుల కార్గో వాహనాలను కలిగి ఉంది. హోల్ సేల్ అండ్ డిస్ట్రిబ్యూటర్లు, హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సైన్స్(Life Sciences), ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, నిర్మాణ మెటీరియల్స్, బిల్డింగ్ మెటీరియల్స్, ఈ-కామర్స్, స్థానిక చేతి వృత్తి ఉత్పత్తులు, సీజనల్ ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, పూలు, పాలు, డైరీ ఉత్పత్తులు, మాంసం, పౌల్ట్రీ(Paultry) వంటి వాటిని కూడా పార్సిల్​కు అనుమతిస్తామని యాజమాన్యం వెల్లడించింది.

పార్సిళ్లకు జీపీఎస్ ట్రాకింగ్ :బుకింగ్ కౌంటర్లు 24 గంటల పాటు ఎంపిక చేసిన బస్ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పార్సిళ్లకు జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పార్సిల్ బుక్ చేసుకున్న వారు అది ఎక్కడ ఉంది. ఎప్పటి వరకు చేరుకుంటుంది తదితర వివరాలను ట్రాక్ చేసి తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. ప్రతి రోజు ఆర్టీసీ సగటున 15 వేల పార్సిళ్లను బట్వాడా(Delivery) చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్సిళ్లను టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ పార్సిళ్ల రవాణా వల్ల టీఎస్‌ఆర్టీసీకి సుమారు రూ. 120 కోట్ల ఆదాయం వచ్చినట్లు యాజమాన్యం వెల్లడించింది.

హోం పికప్ అండ్​ డెలివరీ : ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌ ప్రాంగణంలో మోడల్‌ లాజిస్టిక్ కౌంటర్‌(Model Logistic Counter)ను ప్రారంభించిట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. త్వరలోనే ఇలాంటి కౌంటర్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామన్నారు. లాజిస్టిక్స్‌ విభాగ విస్తరణతో పాటు పెట్రోల్‌ బంక్​ల ఏర్పాటు, జీవా వాటర్‌ బాటిళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో పార్సిళ్లకు హోం పికప్, డెలివరీ సదుపాయాన్ని కల్పించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. లాజిస్టిక్స్‌ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040-69440069లో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాల కోసం https://www.tsrtclogistics.in వెబ్‌సైట్​లో సంప్రదించాలని సూచించారు.

'ఆర్టీసీ కార్గో లాజిస్టిక్స్​ సేవల వల్ల ప్రజలకు పార్సిళ్ల డెలివరీ సులువుగా అయింది. ఆర్టీసీ సంస్థ మీద నమ్మకంతో చాలా మంది కార్గో సేవలు వినియోగించుకుంటున్నారు.'- వినయ్, దిల్​సుఖ్​నగర్​ లాజిస్టిక్ విభాగం ఇన్​ఛార్జి

కార్గో లాజిస్టిక్స్​పై దృష్టి సారించిన టీఎస్​ఆర్టీసీ - అత్యాధునిక సేవలు విస్తరించేలా ప్రణాళికలు

అధిక వడ్డీ ఆశ చూపించారు - సొమ్ము చెల్లించాక బోర్డు తిప్పి ఉడాయించారు

తెలంగాణ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్​ - రేపు బాధ్యతల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details