24 Trains Cancellation :రైలు ప్రయాణికులకు అలర్ట్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదుగా నడిచే పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రేపటి నుంచి మార్చి 2 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 12 గంటల్లో వాయుగుండం బలపడే అవకాశముందన్న సమాచారంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 24 రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు వాటి వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్లో అధికారులు ఉంచారు.
ఏపీపై వాయుగుండం ప్రభావం :పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరో 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరకోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి చిరు జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.