తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుపతిలో తొక్కిసలాట - ఆరుగురు భక్తుల మృతి - STAMPEDE IN TIRUMALA IN AP

తిరుపతిలోని వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బుధవారం తోపులాట - ఐదుగురు మహిళా భక్తులు సహా ఆరుగురు మృతి - పదుల సంఖ్యలో క్షతగాత్రులు

TIRUMALA TIRUPATI DEVASTHANAM
SEVERAL DIE IN TIRUMALA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 9:56 PM IST

Updated : Jan 9, 2025, 6:28 AM IST

Massive Stampede at Tirumala :తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలి రావడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

1.20 లక్షల టోకెన్లు జారీ :వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్‌ సర్వ దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్‍, విష్ణునివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరణి, ఎమ్మార్​పల్లి ప్రాంతాలకు భారీగా భక్తులు తరలివచ్చారు.

తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలివచ్చిన భక్తులను సమీపంలో ఉన్న పద్మావతి పార్క్​లోకి తరలించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ముందుగా ప్రకటించిన సమయం కంటే 8 గంటల ముందే టోకెన్లు జారీ ప్రారంభించారు. రాత్రి 8 గంటల 15 నిమిషాల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు, ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే క్షత్రగాత్రులను రుయా, స్విమ్స్‌ ఆసుపత్రులకు తరలించారు.

ఆరుగురు మృతి : అస్వస్థతకు గురైన వ్యక్తి కోసం గేటు తెరిచేలోపే ఈ విషాదం జరిగిందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, విశాఖపట్నానికి చెందిన రజిని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మలగా గుర్తించారు. నర్సీపట్నం పెదబొడ్డేపల్లికి చెందిన నాయుడు బాబు ఈ ఘటనలో మృతి చెందినట్లు ఆయన భార్య మణికుమారి ఫోన్ ద్వారా బంధువులకు తెలియజేశారు. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

టీటీడీ ఛైర్మన్‍ పరామర్శ : రద్దీ ఎక్కువైనందునే టోకెన్ల జారీకి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. క్షతగాత్రుల్లో 32 మంది రూయా ఆస్పత్రిలో, 14 మంది స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న భక్తులను టీటీడీ ఛైర్మన్‍, బోర్డు సభ్యులు పరామర్శించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమతమైన ఉన్నతాధికారులు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్ధితి అదుపులోకి తెచ్చారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి : ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో మీకు తెలుసా?

తిరుమలలో భక్తుల సొత్తు స్వాహా! - దొరికిన వస్తువులను అప్పనంగా పంచేసుకున్నారు!

Last Updated : Jan 9, 2025, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details