Meerpet Murder Case Update : తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మీర్పేట చిల్లెలగూడలో జరిగిన దారుణ హత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఓ మహిళతో ఉన్న సంబంధం ఈ హత్యకు దారి తీసినట్లు విచారణలో భాగంగా గురుమూర్తి నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. పథకం ప్రకారం హత్య చేసిన గురుమూర్తి, ఓ వెబ్ సిరీస్ తరహాలో మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలనుకున్నట్లు సమాచారం.
మరోవైపు నిందితుడు హత్య చేసినట్లు చెప్పినా, దానికి సంబంధించి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అతడు చెప్పిన విషయాలపై ఆధారపడకుండా వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి ఫోన్ పరిశీలించినప్పుడు మరో మహిళ ఫొటోలు కొన్ని ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన నమోదు చేసిన వెంకట మాధవి అదృశ్యం కేసును హత్య కేసు సెక్షన్ల కింద మారుస్తున్నారు. కేసు విషయంలో నేడు కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా చేరి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకుని సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉండాలని భావించాడు. అదను కోసం ఎదురు చూస్తున్నాడు.
సంక్రాంతి పండుగ సందర్భంగా గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటి దగ్గర దింపాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవారు. 15వ తేదీన ఉదయం గురుమూర్తికి భార్యకు గొడవ మొదలైంది. మరో మహిళతో సంబంధం, ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు భార్య చూసింది. అప్పటికే భార్యను హతమార్చాలని కసితో ఉన్న గురుమూర్తి అనుకున్నంత పని చేశాడు. భార్యను తలమీద కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన వెబ్సిరీస్లోని పాత్రల తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా మృతదేహాన్ని శౌచాలయంలోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు.
మాంసాన్ని ఎముకల నుంచి వేరు చేసి : ఆ తర్వాత బకెట్ నీళ్లను హీటర్తో వేడి చేసి ముక్కల్ని వేశాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకల్ని ముక్కలుగా చేసి అంతా సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు రెండ్రోజులు నిద్రలేకుండా ఇదంతా చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు.