Save Rocks in Telangana : భౌగోళిక పరిస్థితుల వల్ల దక్కన్ పీఠభూమి ఏర్పడింది. లావా వ్యాపించి భూ ఉపరితలంపై గట్టి రాతి పొర, శిలలు ఏర్పడ్డాయి. గాలి, వానలతో శిలలు విభిన్న ఆకృతులను సంతరించుకున్నాయి. అయితే విలువైన ఖనిజాలుండటంతో పాటు, నిర్మాణాల్లో భాగంగా శిలలను ధ్వంసం చేస్తున్నారు. దీంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వీటిని భవిష్యత్ తరాలకు సైతం చూపించాలనే ఉద్దేశంతో సొసైటీ టు సేవ్ రాక్స్ ఏర్పడింది.
Society to Save Rocks Organization : 1996లో ఏర్పడిన ఈ సొసైటీ శిలలు(Rocks in Telangana) గుట్టల ప్రాముఖ్యత గురించి సామాన్యుల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి నెలా మూడో వారంలో రాకథాన్స్ నిర్వహిస్తూ, రాతి గుట్టల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేలా కృషిచేస్తోంది. పురాతనమైన వీటిని ధ్వంసం చేస్తే భవిష్యత్ తరాల వాళ్లు వీటిని చూడలేరని అలాంటి రాక్స్ను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సొసైటీ టు సేవ్ రాక్స్ సభ్యులు చెబుతున్నారు.
Rock Museum In Hyderabad: 3.3 బిలియన్ ఏళ్ల పురాతన శిలలతో 'రాక్ మ్యూజియం'..
శిల అంటే కేవలం రాయిగానే చాలా మంది భావిస్తారు. కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది. అందులో దాగి ఉన్న రూపాన్ని కెమెరాతో బంధించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా సొసైటీ టు సేవ్ రాక్స్ సభ్యుడు అశోక్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆరేళ్లలో దాదాపు 2,000ల ఛాయాచిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పాటు అంతర్జాతీయంగా యూకే, యూఎస్లోనూ ఫోటోలు తీశారు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉద్యోగిగా ఉంటూ ఫోటోగ్రఫీ ప్రవృత్తిగా ఎంచుకొని అందులో శిలలు, గుట్టలు ప్రతిబింబిస్తున్న ఆకారాలను ఫోటోలు తీస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
" శిలల్లో నిల్వ ఉండే నీటి వల్ల పక్షులు, జంతువులకు, కీటకాలు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. హైదరాబాద్లో పట్టణీకరణ కారణంగా శిలలు, గుట్టలు ధ్వంసం అవుతున్నాయి. అలా కాకుండా రాళ్లనే అలాగే ఉంచి వాటి చూట్టూ పనులు చేయవచ్చు. శిలల ధ్వంసం వల్ల జీవవైవిద్యం దెబ్బ తింటోంది. అందుకే మాసొసైటీ శిలల ఫొటోలను తీసి వాటి పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం." -అశోక్, సొసైటీ టు సేవ్ రాక్స్