తెలంగాణ

telangana

ఈ నెల 25 లేదా 27న అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ - ఆ మూడు శాఖలకే తొలి ప్రాధాన్యం - Telangana State Budget

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 6:36 AM IST

Updated : Jul 14, 2024, 7:35 AM IST

Telangana Budget 2024 -2025 : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 25 లేదా 27న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, రాష్ట్రానికి కేటాయింపుల ఆధారంగా బడ్జెట్​లో సవరణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్​లో సంక్షేమ పథకాలకే ఎక్కువ శాతం కేటాయింపులు చేయనున్నారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Telangana State Budget 2024-2025 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సిద్ధమవుతోంది. ఈ నెల 25 లేదా 27న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 23న కేంద్రం పార్లమెంటులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధులు దక్కుతాయనే అంచనాల ప్రకారం, రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసేలా రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్‌ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి. వాటికే రూ.90 వేల కోట్లకు పైగా కావాలని అంచనా. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగు నీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్‌కు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుందని అధికారులు పేర్కొంటున్నారు. రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఆ పథకానికి కొంత సొమ్మును కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణకు కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరు చెయ్యాలి : వినోద్ కుమార్ - BRS Vinod Kumar Comments

రుణమాఫీకే రూ.31 వేల కోట్లకు పైగా : రైతు భరోసాకు ఏటా బడ్జెట్‌లో రూ.14 వేల కోట్ల వరకూ కేటాయిస్తున్నందున, ఈ ఏడాది అంతకు తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతోంది. మొత్తం వ్యవసాయ శాఖకు ఈ ఏడాది రూ.55 వేల కోట్ల వరకు కావాలనే అంచనాలున్నాయి. అందులో రూ.31 వేల కోట్లకు పైగా రుణమాఫీకే ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇక సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తైనవి ఉన్నాయి. వాటికయ్యే తక్కువ మొత్తాన్ని ఖర్చుపెట్టి మిగిలిన పనులు పూర్తి చేస్తే కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దాదాపు రూ.19,500 కోట్లు కావాలని నీటి పారుదల శాఖ ఆర్థిక శాఖకు తెలిపినట్లు సమాచారం.

గృహజ్యోతికి రూ.150 కోట్లు : ఇవి కాకుండా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలు సొమ్ము కిస్తీల చెల్లింపులకూ భారీగా నిధులు అవసరం కానుంది. గృహజ్యోతి పథకానికి సంబంధించి, విద్యుత్‌ రాయితీ పద్దు కింద రూ.15 వేల కోట్లు కావాలని డిస్కంలు కోరుతున్నాయి. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు నెలకు రూ.150 కోట్ల వరకు అవసరమని డిస్కంల అంచనా. అందుకు తగ్గట్లుగా కేటాయింపులు చేయాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరుతున్నాయి. అయితే, గృహజ్యోతి గతంలో రాష్ట్ర బడ్జెట్‌లో లేని పథకం కనుక ఈ మేరకు చెల్లింపులు జరిగేలా రాష్ట్ర బజ్జెట్​లో కేటాయింపులు జరిగేలా చూడాలంటూ అధికారులు కోరుతున్నారు.
జీహెచ్​ఎంసీ, జలమండలికీ రాష్ట్ర బడ్జెట్​లో నిధులు కేటాయించాలి : కిషన్​ రెడ్డి - Kishan Reddy wants funds to GHMC

Last Updated : Jul 14, 2024, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details