తెలంగాణ

telangana

ETV Bharat / state

మాకొద్దు ఈ 'పంచాయతీ'లు - పిల్లలకు పాఠాలు చెప్పబోతున్న 111 మంది కార్యదర్శులు

ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన 111 మంది పంచాయతీ కార్యదర్శులు - ఐదేళ్లుగా పని చేస్తున్నా క్రమబద్ధీకరణ జరగకపోవడంతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Teaching jobs In Telangana
Panchayat Secretaries who Got teaching jobs (ETV Bharat)

Panchayat Secretaries who Got teaching jobs :పంచాయతీ కార్యదర్శులు ఇన్ని రోజులు గ్రామాల్లో పని చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు కొలువు కొట్టి పిల్లలకు పాఠాలు చెప్పబోతున్నారు. ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుంచి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, రోడ్ల మరమ్మతులు, ధ్రువీకరణ పత్రాలు, అనుమతుల జారీ విధులు నిర్వర్తించారు. ఇకపై వారు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 111 మంది పంచాయతీ కార్యదర్శులు డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఇందులో 70 మంది ఎస్జీటీలు కాగా, 41 మంది స్కూల్‌ అసిస్టెంట్లు. నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 11 మంది, కామారెడ్డి నుంచి 10 మంది, జనగామ జిల్లా నుంచి 9 మంది పంచాయతీ కార్యదర్శులు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు.

భారీగా ఖాళీలు : 111 మంది పంచాయతీ కార్యదర్శులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి. గ్రూపు-4 ఉద్యోగాల మెరిట్‌ జాబితాలో 200 మంది ఉన్నారు. గ్రూపు-2, గ్రూపు-1లకు చాలా మంది సన్నద్ధమవుతున్నారు. ఆయా పరీక్షల ఫలితాలు వచ్చాక ఖాళీలు మరిన్ని పెరగనున్నాయి. పంచాయతీ కార్యదర్శులకు పని భారంతో పాటు వేతనాలు తక్కువగా ఉన్నాయి. వెయ్యి మందికి పైగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు అయిదేళ్లుగా పని చేస్తున్నా, క్రమబద్ధీకరణ జరగలేదు. ఈ కారణాలతో చాలా మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి సారిస్తున్నారు.

డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక పత్రాలు : డీఎస్సీలో ఎంపికైన వారికి ప్రభుత్వం ఇటీవల నియామక పత్రాలు అందజేసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారిని గుర్తించి ఒక్కొక్కరికి ఒక్కో పోస్టును మాత్రమే కేటాయిస్తూ పోస్టులను భర్తీ చేసింది. ఇందులో భాగంగా ముందుగా స్కూల్ అసిస్టెంట్​గా ఎంపికైన వారిని ప్రకటించింది. ఆ తర్వాత ఎస్జీటీ పోస్టుల ఫలితాలను ప్రకటించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,515 స్కూల్ అసిస్టెంట్, 685 భాషా పండితులు 145 పీఈటీ, 6,277 ఎస్జీటీ, 103 స్పెషల్ ఎడ్యుకేషన్‌, 281 ఎస్జీజీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేసినట్టు ప్రకటించింది. ఈ మేరకు ఎంపికైన వారికి మంగళవారం సాయంత్రానికే జిల్లాల వారీగా సమాచారం అందించారు.

ఉపాధ్యాయ కొలువుల్లో కొత్త అధ్యాయం - ఎంపికైన అభ్యర్థులకు నేడే నియామక పత్రాల అందజేత

డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్య గమనిక - ఒక్కరికే రెండు పోస్టులు రావు - DSC Candidates Posting Updates

ABOUT THE AUTHOR

...view details