ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Health Team

Published : 15 hours ago

ETV Bharat / state

చీటికి మాటికి యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారా? - మితిమీరితే మీ పిల్లలకూ ముప్పేనట - Antibiotics Effects on Kids

Antibiotics Side Effects in Health : ఉబ్బసం వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏటా పెరుగుతోందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఉబ్బసం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్​ నిలోఫర్‌ ఆసుపత్రి సీనియర్‌ పీడియాట్రీషియన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తోట ఉషారాణి ఈటీవీ భారత్‌కు వివరించారు.

Antibiotics Effects on Kids Health
Antibiotics Effects on Kids Health (ETV Bharat)

Antibiotics Effects on Kids Health :ఔషధ చికిత్సలో శక్తిమంతమైన అస్త్రం యాంటీబయాటిక్స్‌. వాటిని అవసరం లేకున్నా వినియోగిస్తే మాత్రం, అది కూడా పసి వయసులో వాడితే చిన్నారులు ఉబ్బసం (ఆస్తమా) బారినపడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో యాంటీ బయాటిక్స్‌ ఉపయోగిస్తే ఉబ్బసం ముప్పు ఎందుకు పెరుగుతోంది, దాని ప్రభావం భవిష్యత్​పై ఎలా ఉంటుందనే కోణంలో ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేయగా, దానికి సంబంధిత పత్రం తాజాగా టీబీసీ జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 2.60 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారని, ఈ వ్యాధితో ఏటా 4.55 లక్షల మంది చనిపోతున్నారని జర్నల్‌లో పేర్కొన్నారు.

అధికంగా వాడితే పని చేయవు :5 సంవత్సరాల్లోపు చిన్నారులకు వచ్చే ఇన్‌ఫెక్షన్లకు 90 శాతం కారణం వైరస్‌లే. వీటి కారణంగా మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉండి, నాలుగైదు రోజుల తర్వాత దానంతటే తగ్గిపోతుంది. కాకపోతే కొందరు తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. అవగాహన లేని కొందరు వైద్యులు కూడా చిన్నారులకు యాంటీబయాటిక్స్‌ ఇస్తుంటారు. ఇలా వాటితే నిరోధకత ఏర్పడి, పిల్లలకు భవిష్యత్​లో నిజంగా అవసరమైన సందర్భాల్లో అవి పనిచేయవు. ఇలా వాడటం కారణంగానే ఒకప్పుడు టైఫాయిడ్‌కు బాగా పని చేసిన సిప్రోఫ్లోక్సాసిన్‌ ఇప్పుడు అస్సలు పని చేయడం లేదు.

యాంటీబయాటిక్స్‌ వాడితే మంచి బ్యాక్టీరియాకు చెడు : పసి వయసులో ఉన్నప్పుడు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ కీలక దశలో తల్లిపాలు పట్టడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని అంటున్నారు. రోగ నిరోధక శక్తి చక్కగా పని చేయడానికి ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందని వివరించారు. అయితే యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడటం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు కీడు జరుగుతోందని, రోగ నిరోధక శక్తిపై దుష్ప్రభావం పడుతోందని తెలిపారు. దీని ఫలితంగా ఆస్తమా ముప్పు పెరుగుతోంది. ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లో 12 ఏళ్లలోపు పిల్లల్లోని 7.9 శాతం మందికి ఆస్తమా ఉంటోంది. పిల్లలు, పెద్దలు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా కారణంగా సంభవించే మరణాల్లో సుమారు 46 శాతం భారత్‌ నుంచే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి :ఆస్తమా వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ముందుగా దగ్గుతో ప్రారంభమవుతాయి. పిల్లల్లో పిల్లి కూతలు వస్తుంటాయి. అనంతరం డొక్కలు ఎగరేస్తారు. ఆయాసం కూడా పెరుగుతుంది. ఆహారం తినడానికి ఇష్టపడరు. అదేపనిగా ఏడుస్తుంటారు. ఉబ్బసం పెరిగితే ఆక్సిజన్‌ అందక జీవన్మరణ సమస్య కూడా పెరుగుతోంది.

ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి : బిడ్డ పుట్టిన తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత రెండేళ్ల వరకు ఇతర ఆహారంతో పాటు తల్లిపాలను ఇస్తే ఆస్తమా బారినపడకుండా రక్షణ వస్తుంది. సీసా పాలతో పెరిగిన పిల్లలకు, తక్కువ బరువుతో, నెలలు నిండక ముందే పుట్టిన వారు, సిజేరియన్‌తో జన్మించిన పిల్లలకు ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువని చెప్పారు. అందుకే వైద్యులు యాంటీబయాటిక్స్‌ ఇస్తే, వాటి వాడకం గురించి పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా అడగాలి.

ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నామా..! యాంటీబయాటిక్స్ మందుల వాడకంపై నిపుణుల మాటేంటీ!

వైరస్​లపై ఆయుధాలను పొదుపుగా వాడాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details