MLA Danam Nagender Fire Officials : హైదరాబాద్ ఖైరతాబాద్లోని చింతల్ బస్తీలో ఫుట్పాత్లపై ఆక్రమణలను కూల్చివేస్తున్న అధికారులపై స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్ పాత్ కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న దానం అక్కడి చేరుకొని కూల్చివేతలను వెంటనే ఆపాలని అధికారులను కోరారు.
సీఎం వచ్చే వరకు ఆపండి : స్థానిక ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎలా కూల్చివేతలు చేపడతారంటూ అధికారులపై దానం అసహనం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడం ఎంటని మండిపడ్డారు. దావోస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని, లేకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామని దానం హెచ్చరించారు.
"ఎమ్మెల్యే అయిన నాకు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేపడతారు. మీరు కూల్చివేతలు ఆపండి. ఆపకుంటే ఆ బండి ముందు కూర్చోవాలా చెప్పండి. కూల్చివేయాలంటే వంద ఉన్నాయి. నాతో రండి చూపిస్తా మీకు పెద్ద పెద్ద కాంప్లెక్సులు ఉన్నాయి. అవి కూల్చండి ముందు. ఇది మాత్రం ఇప్పుడు ఆపండి లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది మీ ఇష్టం. మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదు. మీ పని ఏమి లేదు. రెండు రోజులు సీఎం గారు వచ్చే వరకు ఆపండి. రెండ్రోజులు ఆపడానికి ఏమి అవుతుంది" - దానం నాగేందర్, ఎమ్మెల్యే