తెలంగాణ

telangana

ETV Bharat / state

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి - 'సియోల్' టెక్నాలజీతో హైదరాబాద్‌లో వ్యర్థాలకు చెక్!

దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన - సియోల్‌లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను సందర్శించిన బృందం - ఆ విధానం ఇక్కడ అమలుచేసే అవకాశం పరిశీలన

Telangana Ministers Team Visited Seoul
Mapo Resource Recovery Plant in Seoul (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 10 hours ago

Updated : 8 hours ago

Telangana Ministers Team Visited Mapo Resource Recovery Plant in Seoul : తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. సియోల్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ జీహెచ్‌ఎంసీ, మూసీ రివర్‌ఫ్రంట్ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను ఈ బృందం సందర్శించింది.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రుల బృందం పర్యటన (ETV Bharat)

ఈ కేంద్రంలో రోజుకు 1000 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి, విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల రీసైక్లింగ్‌కు వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీని సియోల్‌ నగర పాలక సంస్థ వాడుతోంది. పర్యావరణంపై ఏమాత్రం దుష్ప్రభావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. మరో పదేళ్లలో భూ ఉపరితలం నుంచి పూర్తిగా తొలగించి, భూగర్భంలో అతి పెద్ద ప్లాంట్‌ను నిర్మించేందుకు సియోల్ నగర పాలక సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ పని తీరును అధ్యయనం చేసేందుకు తెలంగాణ మంత్రుల బృందం అక్కడకు వెళ్లింది. ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేసే అవకాశాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌, సియోల్‌ నగర నమూనాలు ఒకేలా ఉంటాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. సియోల్‌లో సుమారు 10 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరించి, నగరంలోని 4 వైపులకు తరలిస్తున్నారని వివరించారు. అదే మన హైదరాబాద్‌లో దాదాపు 8 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరించి ఒకే వైపునకు తీసుకెళ్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సియోల్‌లో మాదిరిగానే నగరం చుట్టూ 4 ప్రదేశాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇలా నాలుగు వైపులకు తరలించడం ద్వారా రవాణా ఖర్చులు కలిసొస్తాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరం, తెలంగాణ ప్రజల భావితరాల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూసీనదిని ప్రక్షాళన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. సియోల్‌లోని చెయోంగ్‌ గయ్‌ చియోన్‌ నదిని ఇతర మంత్రులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

Last Updated : 8 hours ago

ABOUT THE AUTHOR

...view details