Minister Uttam Kumar On Caste Census Survey :వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై కేబినెట్ సబ్ కమిటీకి(మంత్రివర్గ ఉపసంఘం) నివేదిక అందజేశారు. కులగణనపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక, కులగణన సర్వే చేపట్టామని ఆయన వెల్లడించారు.
96.9శాతం మంది వివరాలందించారు :స్వాతంత్య్రం పూర్వం నుంచి మనదేశంలో జనగణన జరుగుతోందని, అసలైన పేదలను గుర్తించేందుకు కులగణన మాత్రం జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానించిందని వివరించారు. బలహీనవర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేపట్టామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని తెలిపారు. 96.9శాతం (3.50 కోట్ల మంది) మంది సర్వేలో పాల్గొని వివరాలను అందించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. 3.1శాతం (16లక్షల మంది) వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదని తెలిపారు.
కేబినెట్లో చర్చించి శాసనసభలో ప్రవేశపెడతాం :ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని వివరించారు. ఈనెల 4న మంత్రివర్గం ముందు కులగణన సర్వే నివేదిక ప్రవేశపెడతాని ఆయన వెల్లడించారు. కేబినెట్లో చర్చించి వెంటనే శాసనసభలో ప్రవేశ పెడతామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.