Minister Seethakka Review on Floods : వర్షాకాలంలో ఏలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాలు, వరదల పరిస్థితిపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్షించారు. పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ కమిషనర్, శాఖాపరమైన అధికారులు, జిల్లా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
బీజేపీ హయాంలో ఉపాధి హామీచట్టం నిర్వీర్యం : మంత్రి సీతక్క - seethakka fires on bjp
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై మంత్రి సీతక్క అధికారులతో చర్చించారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు ఉన్నందున, ముందస్తుగా సమస్యలను గుర్తించి వాటిని పరిస్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్లు, పాత కనెక్షన్లపై సమీక్షించిన మంత్రి సీతక్క పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నీటిపంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. వర్షాల వల్ల పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటితో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు సూచించారు. హోటళ్లు, మార్కెట్లు, దుకాణాలలో నిల్వ ఉంచే వస్తువులపై నిఘా ఉంచాలని, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటే వాటిని తాత్కాలికంగా నిషేధించాలని ఆమె స్పష్టం చేశారు.