తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీని వెంటాడుతున్న అల్పపీడనం - బిక్కుబిక్కుమంటున్న కోస్తా జిల్లాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం - పశ్చిమ వాయువ్య దిశగా పయనం - దక్షిణ కోస్తా పలు జిల్లాలో అతి భారీ వర్షాలు

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

Heavy Rainfall Alert in AP
Heavy Rainfall Alert in AP (ETV Bharat)

Heavy Rainfall Alert in AP : గత నెల భారీవర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్​ను మరో కొత్త సమస్య కలవరపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా వెళ్తోంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తా ప్రాంతంలో మరింత బలపడుతుంది. ఈ ప్రభావం వల్ల దక్షిణ కోస్తా కొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కృష్ణ ,బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ ప్రకటించారు. వర్షాలు పడే సమయంలో దక్షిణ కోస్తాలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఒంగోలులో 8 సెం.మీ, నెల్లూరు జిల్లా కందుకూరులో 5, విశాఖలో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈరోజు, రేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. చిత్తూరు, కడప జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ఇవాళ్టి నుంచి రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తీరంలో తీవ్ర తుపాన్​ హెచ్చరికలు :ఈ ఏడాది బంగాళాఖాతంలో తుపాను తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఏపీ​కి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఏటా నైరుతి రుతుపవనాలు తిరోగమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ పరిస్థితులు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటానికి అనుకూలంగా ఉండటంతో, అవి క్రమేపీ వాయుగుండాలు, తుపాన్లుగా మారతాయి.

ఇవాళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుపానుగా మారే అవకాశం లేకపోలేదు. అల్పపీడనం, తీవ్ర వాయుగుండంగా మారి, తర్వాత తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత పదేళ్లలో అక్టోబరు - డిసెంబరు మధ్యకాలంలో 11 తుపాన్లు ఏర్పడగా, అందులో 6 ఏపీలోనే తీరం దాటాయి. అటూ అరేబియా సముద్రంలో ఇప్పటికే తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీని ప్రభావం అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకూ ద్రోణి కొనసాగుతోంది.

సెప్టెంబరు నెలలో ఇదే విధంగా బంగాళాఖాతంలో వాయుగుండం, అరేబియా సముద్రంపై కదులుతున్న తుపాను ప్రభావంతో ఏర్పడిన ద్రోణి విజయవాడ నగరంలో కుంభవృష్టికి కారణమైంది. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం బంగాళాఖాతంలో ద్రోణిపై పడినట్లుగా తెలుస్తోంది. దీనివల్లే బంగాళాఖాతంలోనూ అల్పపీడనం ఏర్పడింది.

అక్టోబరు - డిసెంబరు మధ్యలో ఏపీపై ప్రభావం చూపిన కొన్ని తుపాన్లు :

క్రమ సంఖ్య సంవత్సరం తుపాను తీరం దాటిన ప్రాంతం ప్రభావితమైన జిల్లాలు
01 2014 అక్టోబరు హుద్ హుద్ విశాఖపట్నం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం
02 2016 డిసెంబరు వార్దా చెన్నై నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప
03 2018 అక్టోబరు తిత్లీ పలాస శ్రీకాకుళం, విజయనగరం
04 2018 డిసెంబరు పెతాయ్ కాకినాడ కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి
05 2021 సెప్టెంబరు గులాబ్ కళింగపట్నం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం
06 2022 డిసెంబరు మాండౌస్ మహాబలిపురం చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్
07 2023 డిసెంబరు మిచౌంగ్ బాపట్ల చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details