ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమిస్తే ఓకే - కాదంటే హత్యే - ఉసురుతీస్తున్న ఉన్మాదం

చట్టమంటే లెక్కలేదు శిక్ష పడుతుందనే భయం లేదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Murders in Name of Love
Murders in Name of Love (ETV Bharat)

Murders in Name of Love :వారికి చట్టమన్నా లెక్కలేదు, శిక్ష పడుతుందనే భయం లేదు క్రూరత్వానికి ఉన్మాదం తోడై కొందరు ప్రేమ పేరిట అత్యంత కిరాతకంగా అంతమొందిస్తూ పేట్రేగిపోతున్నారు. ఇదేదో ఒకటో, రెండో ఘటనలకు పరిమితం కాలేదు. ఏపీలో కొన్నేళ్లుగా ఇలాంటి దారుణాలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ తరహా దుశ్చర్యలకు తెగబడితే తమ జీవితం నాశనమైపోతుందన్న భయం కొరవడి ఆటవికంగా వ్యవహరిస్తున్నారు.

ఇలాంటి మృగాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. మహిళలు, అమ్మాయిలపై నేరాలకు తెగబడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న బలమైన హెచ్చరిక అవసరం. తాజాగా వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది ఘాతుకానికి ఇంటర్మీడియట్‌ విద్యార్థిని బలైపోయిన ఘటనల వంటివి పునరావృతం కాకూడదంటే అటు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు సమాజం, తల్లిదండ్రులూ కీలక పాత్ర వహించాలి.

ప్రతి 100 కేసుల్లో 96 వీగిపోతున్నాయి : నేరానికి పాల్పడితే శిక్ష పడుతుందనే భయముంటే ఎవరైనా వెనుకంజ వేస్తారు. కానీ ఏపీలో కొన్నేళ్లుగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంటోంది. న్యాయస్థానాల్లో విచారణ పూర్తవుతున్న ప్రతి 100 కేసుల్లో 95 నుంచి 96 వరకు వీగిపోతున్నాయి. కారణాలేవైనా నేరగాళ్లు చట్టం నుంచి తప్పించుకోగలుగుతున్నారు. తాము ఎంతటి దారుణాలకు తెగబడ్డా ఏమీ కాదనే బరితెగింపుతో నిందితులు మరింత రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చి నేరానికి పాల్పడాలంటే భయపడే పరిస్థితులు తీసుకురావాలి.

మహిళలపై నేరాలకు సంబంధించి 2022లో 9,168 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ పూర్తయ్యింది. అందులో కేవలం 414 (4.50 శాతం) కేసుల్లోనే శిక్షలు విధించారు. 8,485 కేసులు వీగిపోయాయి. 2021లో 3,127 కేసుల్లో విచారణ పూర్తికాగా 176 కేసుల్లోనే శిక్ష పడింది. 2,948 కేసులు వీగిపోయాయి. 2020లో 4,367 కేసులకుగాను 279 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. 3,871 కేసులు వీగిపోయాయి. శిక్షల రేటు ఎంత తక్కువుందో ఈ గణాంకాలే నిదర్శనం. లోతైన దర్యాప్తుతో శిక్షల శాతాన్ని పెంచటంపై ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రధానంగా దృష్టి సారించాలి. మరీ ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు, చిన్నారులపై క్రూరమైన నేరాలకు పాల్పడే కేసుల్లో శిక్ష పడకుండా ఏ ఒక్క దోషి తప్పించుకోవటానికి వీల్లేనంత పక్కాగా దర్యాప్తు చేయాలి.

పీడీ యాక్ట్‌ వంటివి ప్రయోగిస్తేనే :రాష్ట్ర స్థాయిలో సంచలనమైన ఘటన జరిగినప్పుడు పోలీసులు ఒకటి, రెండు రోజులు హడావుడి చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. అభియోగపత్రం దాఖలు చేసి సరిపెడుతున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ కేసు గురించి అంతా మరిచిపోతున్నారు. ఈలోగా నిందితులు బెయిల్‌పై బయటకొచ్చేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలి. వారిపై పీడీ యాక్ట్‌ తరహా చట్టాలను ప్రయోగించాలి. వారికి బెయిల్‌ సులువుగా రాని పరిస్థితి కల్పించాలి. ఉన్మాద హిస్టరీ షీట్లు తెరవాలి. చిన్నారులు, అమ్మాయిలు, మహిళలపై జరిగే క్రూరమైన నేరాలన్నింటిలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నా కోర్టుల్లోనూ నిర్దేశిత వ్యవధిలోగా విచారణ పూర్తి చేయించేలా చూడాలి. కొన్ని ప్రధాన కేసులకు సంబంధించి సర్కార్ ఏర్పాటుచేస్తున్న ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు సరిపోవడం లేదు. ప్రతి కేసులోనూ నిర్దేశిత వ్యవధిలోగా విచారణ పూర్తయ్యేలా చేసి శిక్షలు పడేలా చూడాలి. నేరానికి పాల్పడితే తప్పించుకోలేని పరిస్థితి తేవాలి.

అలాంటి నేరాలకు పాల్పడాలంటే వణకాలి : అమ్మాయిలు, మహిళల జోలికెళితే జీవితం చీకటిమయమేనని, భవిష్యత్ నాశనమైపోతుందనే భయం ప్రతి ఒక్కరిలో తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది ఉమేష్​చంద్ర పేర్కొన్నారు. శిక్షలూ అత్యంత కఠినంగా ఉండాలన్నారు. పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయాలని చెప్పారు. రౌడీషీటర్లు, కరడుగట్టిన నేరగాళ్లను నగర, జిల్లా బహిష్కరణ చేసినట్లుగా ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని సమాజ బహిష్కరణ చేయాలని ఉమేష్​చంద్ర సూచించారు.

కఠిన శిక్షలపై ప్రచారం చేయాలి : మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో విస్తృతంగా ప్రచారం చేయాలని మహిళల రక్షణ విభాగం, ఏపీ సీఐడీ ఎస్పీ కేజీవీ సరిత తెలిపారు. ఇలాంటి నేరాలకు ఆస్కారమివ్వొద్దని, ఇలా హద్దు మీరితే జీవితం ముగిసిపోయినట్లేననే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా ఉన్నవారు, సెలబ్రిటీలు చేయాలని చెప్పారు. ఇలాంటి నేరాల్లో పడిన కఠినమైన శిక్షల గురించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని ఆమె పేర్కొన్నారు.

వైఎస్సార్​ జిల్లాలో దారుణం - ఇంటర్‌ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కీచకుడు

ప్రేయసిపై బ్లేడ్​తో దాడి చేసిన ప్రియుడు- ప్రేమ పేరుతో వేధింపులు!

ABOUT THE AUTHOR

...view details