Dirt Road Build Collection Toll : సాధారణంగా జాతీయ రహదారులపై టోల్గేట్లు చూస్తుంటాం. నాణ్యమైన, గుంతలు లేని రోడ్డుని ఉపయోగించి మనం సాఫీగా ప్రయాణించేందుకు టోల్ చెల్లిస్తాం. అయితే, అసలు అనుమతే లేని మట్టి రోడ్డుకు మీరు టోల్ చెల్లిస్తారా? లేదు కదా! ఇక్కడ మాత్రం రోజుకు వందలాది వాహనాల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులు వివిధ ఆటంకాలతో ఆగిపోతుండటంతో పక్కనే మట్టి రోడ్డు వేసిన అక్రమార్కులు టోల్ దందాకు తెరలేపారు.
ఈ మానేరు వాగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి, పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్య ఉంది. ఇక్కడి వాహనదారుల కోసం 9 ఏళ్ల క్రితం నాటి సర్కార్ రూ.51 కోట్లతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నిధులు త్వరగానే విడుదల కావడంతో పనులు సైతం చకచకా జరిగాయి. అయితే గతేడాది కురిసిన వర్షాలు, వరదలతో వంతెన తాలుకూ 8 గడ్డర్లు కుప్పకూలాయి. దీంతో పనులూ నిలిచిపోయాయి. నాసిరకం పనులే కారణమని భావించిన సర్కార్, సదరు కాంట్రాక్టర్కు ఉద్వాసన చెప్పి మళ్లీ టెండర్లు పిలిచింది. రూ.20 కోట్లతో టెండర్లు దక్కించుకున్న మరో కంపెనీ సైతం ఇంకా పనులు ప్రారంభించలేదు. దీన్నే ఆసరాగా తీసుకున్న అక్రమార్కులు వాగులో మట్టిరోడ్డేసి వసూళ్లకు పాల్పడుతున్నారు.
వాహనదారులు ప్రశ్నించినా నో యూజ్ : వరంగల్, హనుమకొండ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఇది దగ్గరి దారి కావడంతో రోజూ వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా మట్టి రోడ్డు నిర్మించిన అక్రమార్కులు, దానిపై టోల్ వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇదేమని ప్రశ్నించిన వారిని ఆ దారిపై వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మానేరు వాగుపై నిర్మించిన మట్టి రోడ్డుకు టోల్ వసూలు చేయడమేంటని వాహనాదారులు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. టేకుమట్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో దందా వెలుగులోకి వచ్చింది.