Hyderabad Govt Schools : ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరు ప్రధానోపాధ్యాయులు మాత్రం ఈ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, పరీక్షలు రాసి ఫెయిలైతే తమపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్న భావనతో ఒత్తిడిని తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మొన్న నిర్వహించిన ఎస్-1 పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఓపెన్ స్కూల్లో పరీక్షలు రాయాలంటూ సూచిస్తున్నారు. అలాగే ఓపెన్ స్కూల్ నిర్వాహకులతో సైతం మాట్లాడుతున్నారు.
హైదరాబాద్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓపెన్ స్కూల్లో నలుగురు హైదరాబాద్ విద్యార్థులు ఉండటంతో వారిని ఈనాడు-ఈటీవీ భారత్ ప్రతినిధి పలకరించగా ఈ బాగోతం వెలుగుచూసింది. ఈ విషయాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి తీసుకెళ్లగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నగరంలోని నాంపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బేగంబజార్, గన్ఫౌండ్రీకి చెందిన నలుగురు విద్యార్థులు తొమ్మిదో తరగతి వరకు చదివారు. పదో తరగతికి వచ్చేసరికి నామినల్ రోల్స్ను పాఠశాల విద్యా సంచాలకుడి కార్యాలయానికి పంపే ముందు వారి తల్లిదండ్రులను పిలిపించి ఇక్కడ చదివితే మీ పిల్లలు ఫెయిల్ అవుతారని చెప్పి టీసీలు ఇచ్చి పంపించేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని ఓపెన్ స్కూల్ నుంచి పదో తరగతి పరీక్షలు రాయించాలని సూచిస్తూ అతి సులభంగా సిలబస్ ఉంటుందని వారిని నమ్మించారు. ఇదే తరహాలో షేక్పేట మండలంలోని ఓ పాఠశాలలో తొమ్మిది మందికి అక్కడి హెచ్ఎం టీసీలు ఇచ్చి పంపించేశారంట.
11 వేల మంది పదో తరగతి విద్యార్థులకు 9800 మందే : పదో తరగతి పరీక్ష ఫలితాలు అనగానే హైదరాబాద్ స్థానం ఎక్కడో చివరన లేదా చివరి నుంచి ఐదు స్థానాల్లో ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చాలని హైదరాబాద్ కలెక్టర్ ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. ఎలాగైనా తొలి ఐదు స్థానాల్లో నిలపాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశిస్తూ, విద్యార్థులు ఫెయిలైతే సంబంధిత హెచ్ఎంలదే బాధ్యత అంటూ హెచ్చరించారు. దీంతో సరిగా చదవని విద్యార్థులను గుర్తించి హెచ్ఎంలు టీసీలు ఇచ్చి పంపించేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో గతేడాది 9వ తరగతిలో 11 వేల విద్యార్థులు ఉంటే ఇప్పుడు 9800 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. టీసీలు ఇచ్చి హెచ్ఎంలు పంపడం వల్లే ఇదంతా జరిగిందని అంతా భావిస్తున్నారు.
ఓపెన్ స్కూల్లో ఎవరైనా జాయిన్ కావొచ్చు : ఓపెన్ స్కూల్లో 14 ఏళ్లు నిండిన వారు ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా జాయిన్ కావచ్చు. ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా నేరుగా పది పరీక్షలు రాయవచ్చు. వీటిలో కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల వారీగా సిలబస్ను రూపొందిస్తుంది. ఈ సిలబస్ స్టేట్ సిలబస్తో పోల్చితే కాస్త సులువుగానే ఉంటుంది.
లెక్కల భయం వీడండి - హిందీపై నిర్లక్ష్యం వలదండి - పదో తరగతిలో మంచి మార్కులు సాధించండి
పదో తరగతి విద్యార్థులు కాస్త శ్రద్ధ పెడితే చాలు - ఆ సబ్జెక్ట్లో మంచి మార్కులు మీ సొంతం!