ICICI BANK Scam In AP : ఏపీలోఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బులు ఎక్కడకు వెళ్లాయో సీఐడీ గుర్తించింది. ఇవాళ మరోసారి బెజవాడలో సోదాలు నిర్వహించిన సీఐడీ బృందం.. ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బును అప్పటి మేనేజర్ నరేష్ టీం వాటిని విజయవాడలోని నెక్సస్ గ్రోత్ సంస్థలో పెట్టుబడులుగా మార్చింది. విషయం తెలుసుకున్న సీఐడీ ఇవాళ సదరు సంస్థకు నోటీసులు ఇచ్చింది. నరేష్ ఖాతా నుంచి పలు లావాదేవీలు నెక్సస్ సంస్థలో ఉన్నట్టు గుర్తించామని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే నెక్సస్ గ్రోత్ సంస్థను ప్రారంభించిన ప్రభు కిషోర్ పరారీలో ఉన్నాడు.
నరేష్ కాజేసిన సొమ్ముతో ప్రభుకిశోర్ అనే వ్యక్తి నెక్సస్ గ్రోత్ ఏర్పాటు చేశాడు. ఇందులో ఉన్న ప్రభుకిశోర్, కిరణ్, అజిత్ సింగ్తో నరేష్ లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రభు కిషోర్తో పాటు నరేష్ లావాదేవీలు నడిపిన కిరణ్, అజిత్ సింగ్ నుంచి కూడా సీఐడీ వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో 3 సీఐడీ బృందాలు సోదాలు చేపట్టాయి. బెజవాడ, నరసరావుపేట, చిలకలూరిపేట బ్రాంచిలలో వివరాలను సేకరించారు.
ఐసీఐసీఐ బ్యాంక్ స్కాం :ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ భారతినగర్ ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్ల్లో గతంలో మేనేజర్గా ఉన్న నరేష్ కస్టమర్ల అకౌంట్ల నుంచి 28 కోట్ల రూపాయలు కొట్టేశాడు. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులకు నకిలీ డిపాజిట్ సర్టిఫికెట్ ఇచ్చి కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. బ్యాంకు ఖాతాదారుల నగదు, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్న నగదును సైతం మాయం చేశాడు. రెండు నెలలుగా ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో బాధితులు బ్యాంకుకు వెళ్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.