తెలంగాణ

telangana

మేడం సార్ మేడం అంతే - ఈ లెక్కల టీచర్‌ పాఠాలు చెప్పే లెక్కే వేరు - HAPPY TEACHERS DAY 2024

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 2:33 PM IST

Updated : Sep 5, 2024, 3:01 PM IST

Story on Padma Priya Vummaji Teacher : గణితం ఈ మాట చెబితే చాలు ఎక్కువ మంది విద్యార్థులు దిక్కులు చూస్తుంటారు. జీవితంలో ప్రతి క్షణం అవసరమయ్యే లెక్కలంటే మక్కువ చూపే వారు తక్కువే. కానీ పదో తరగతి వరకు ఇది తప్పని సబ్జెక్టే. జీవితం సాఫిగా సాగాలంటే నేర్చుకొని తీరాల్సిన పాఠమే. అంత ముఖ్యమైన గణితాన్ని సులభంగా బోధించటమే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తెరలు, ఆన్‌లైన్ పాఠాలను పరిచయం చేసి విద్యార్థులకు కొత్త తరహా బోధన చేసి మేటి గురువుగా నిలిస్తున్నారు పద్మప్రియ అనే గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు.

Special Story on Padma Priya Vummaji Teacher
Special Story on Padma Priya Vummaji Teacher (ETV Bharat)

Special Story on Padma Priya Vummaji Teacher : నిత్య జీవితంలో ప్రతీది లెక్కలతో ముడిపడి ఉంటుంది. ఈ పని చేస్తే ఏం లాభం చేయకపోతే ఏం నష్టం ఇలా ప్రతి ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ లెక్కలు వేసుకుంటారు. గణితం లేనిదే రోజు గడవదు. జీవితంలో భాగమైన లెక్కలను తరగతి గదిలో నేర్చుకోవటం మాత్రం అందరికి ఆసక్తి ఉండదు. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు వచ్చే ఎంతో మంది విద్యార్థులకు లెక్కలంటే భయమంటే అతిశయోక్తి కాదు. అలాంటి గణితాన్ని సులభంగా బోధించటమే కాదు కాన్సెప్ట్ ప్రకారం చెబితే పిల్లలు వాటిని జీవితకాలం గుర్తుంచుకుంటారు అంటారు మలక్‌పేటలోని గవర్నమెంట్ నెహ్రూ మెమోరియల్ పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియ.

పద్మప్రియ ఉమాజీకి చిన్నప్పటి నుంచే గణితమంటే ఎంతో ఇష్టం. తనతోటి వారికి గణింతంలో సందేహాలను నివృత్తి చేసే పద్మప్రియ అదే సబ్జెక్ట్‌లో ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఆంగ్ల మాధ్యమంలో డీఎస్సీ రాసీ మొదటి ర్యాంకు సాధించారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు.

ఆడిస్తూ లెక్కలు చెబుతూ :తొలినాళ్ల నుంచి లెక్కలను కొత్తగా చెప్పాలని పద్మప్రియ తపనపడేవారు. అలా తరగతి గదిలో ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలా కొత్త కొత్త పద్ధతులను అవలంభిస్తూ గణితాన్ని బోధించేవారు. వారితో కలిసి ఆటలు ఆడేవారు, ఆ ఆటల్లోనే ఓ లెక్క ఉందని నేర్పించేవారు. గ్రౌండ్‌లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటూ గీతలు గీసి డైస్ వేయించి ఆటలు ఆడిస్తూ గణితం నేర్పేవారు.

"కొంతమంది విద్యార్థులు వెనకబడి ఉంటారు. చిన్నచిన్న లెక్కలు కూడా చేయలేకపోతారు. అలాంటి విద్యార్థులను గుర్తించాము. వారు ఎందుకు ఇలా ఉన్నారో తెలుసుకున్నాం. వారికి ఎలాంటి సమస్యలున్నా, వాళ్లు ఇష్టమైన పద్ధతిలో బోధించడానికి ప్రయత్నం చేస్తాం. అలా వారి దృష్టిని లెక్కలవైపు వచ్చేలాగా చేస్తాం."- పద్మప్రియ, గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు

2016లో యూఎస్‌లో జరిగిన టీచర్ ఎక్స్‌లెన్స్ అండ్ ఎచీవ్‌మెంట్‌ ప్రోగ్రాంకి పద్మప్రియ ఎంపికయ్యారు. భారత్ నుంచి ఏడుగురుని ఈ కార్యక్రమం కోసం అమెరికా పంపితే అందులో ఒకరు పద్మప్రియ కావటం విశేషం. ఆరు వారాల పాటు జరిగిన కార్యక్రమంలో అక్కడ బోధనా పద్ధతులను పరిశీలించి ఇక్కడ వాటిని అమలు చేసేందుకు కృషి చేశారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి 'మిషన్​ 100' - ఆవిష్కరణలే అతని ఊపిరి - tg teacher NATIONAL TEACHER AWARD

తనతోనే ఇంటిగ్రేటెడ్ విధానం బోధన ప్రారంభం :తాను సరదాగా నేర్చుకున్న కోడింగ్‌కి, యానిమేషన్‌ని జతచేసి కొత్త కొత్త గేమ్స్‌ని సొంతంగా డిజైన్ చేసి వాటి ద్వారా పిల్లలకు లెక్కలు బోధించేవారు. అలా 2020 నాటికే తాను పని చేస్తున్న నెహ్రూ మెమోరియల్ స్కూల్ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ విధానంలో గణితాన్ని బోధించటం ప్రారంభించారు.

సాధారణంగా డిజిటల్ తెరలు ఆధునిక బోధనలు ప్రైవేటు పాఠశాలలకే పరిమితమని చాలా మంది భావన. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే సుమారు పదేళ్లుగా ప్రొజెక్టర్లతో డిజిటల్ పాఠశాలు బోధిస్తున్నారు పద్మప్రియ. ఇటీవల ప్రభుత్వం సైతం 8 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల్లో భాగంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్‌ని అందించింది. దీంతో ఈ తరహా బోధన మరింత సులభమైందంటారు పద్మప్రియ.

విదేశీ ఉపాధ్యాయులతో బోధన : విదేశీ ఉపాధ్యాయులను ఇక్కడి తీసుకువచ్చి పాఠాలు బోధించేలా చేయటం, వారితో కలిసి కొత్త కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. సరికొత్త పద్ధతుల్లో గణితాన్ని ఎక్కువ మందికి నేర్పుతున్న పద్మప్రియ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020లో జాతీయ ఉపాధ్యాయ అవార్డుతో గౌరవించింది. అంతేకాదు బాలికల విద్య కోసం కృషి చేస్తున్నారు పద్మప్రియ. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడి ఎవరూ చదువు మధ్యలో మానేయకుండా చూస్తున్నారు. పేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఆర్థిక సాయం సైతం అందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక పద్మ ప్రియ బోధనా విధనాలకు విద్యార్థులు సైతం ఎంతగానో ఆకర్షితులవుతున్నారు.

ప్రస్తుతం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఈఆర్టీతో కలిసి ఓ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. పలువురు ఉపాధ్యాయులకు సరికొత్త సాంకేతిక పద్ధతుల్లో బోధనపై ట్రైనింగ్ ఇవ్వటంలో భాగస్వామయ్యారు. తద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందిచేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.

'ప్రైవేట్ పాఠశాల వద్దు సర్కారు బడి ముద్దు' - వినూత్నంగా విద్యాబుద్దులు నేర్పుతున్న ఉపాధ్యాయుడు - Teacher Teaching Innovative Way

వామ్మో దెయ్యం, అమావాస్య నాడు స్కూల్​లో నిద్రపోయిన టీచర్ - చివరకు ఏం జరిగిందంటే - Ghost Teacher in Adilabad

Last Updated : Sep 5, 2024, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details