తెలంగాణ

telangana

జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - heavy rains in vijayawada

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 8:42 AM IST

Updated : Sep 1, 2024, 8:52 AM IST

Heavy Rains in Vijayawada : రెండు దశాబ్ధాలుగా ఎప్పుడూ నమోదుకానంతంగా కురిసిన వర్షానికి విజయవాడ నగరం వణికిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Heavy Rain in Vijayawada :విజయవాడలో వర్షం సృష్టించిన విళయం అంతా ఇంతా కాదు. ఎడతెరిపిలేని వర్షం వల్ల నగరం అతలాకుతలమైంది. మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్‌ వద్ద కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కొండల కింద రెండు ఇళ్లపై బండరాళ్లు పడ్డాయి. ఇవి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మరో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విజయవాడ యనమలకుదురులో కొండచరియలుపడి 20 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. దుర్గగుడి కొండపై రాళ్లు జారిపడ్డాయి. ఘాట్‌రోడ్డు మూసివేశారు.

జారిపడ్డ రాళ్లు :సమాచార కేంద్రం భవనంపై బండరాళ్లు పడటంతో కార్యాలయం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ కొన్ని నిముషాల ముందు ఉద్యోగులు కార్యాలయం నుంచి భోజనానికి వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. ఒకటో పట్టణం పరిధిలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి ఇళ్ల మీద పడ్డాయి. రెండిళ్లు పూర్తిగా మరికొన్ని పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ముందే ఖాళీ చేయడంతో ఎవరూ గాయపడలేదు. కొండప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.

జలమయమైన విజయవాడ :ఒక పక్క కుండపోత వర్షం మరోవైపు పొంగిన రోడ్లు జలమయమైన రహదారులుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. గత 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూలేనంతగా బెజవాడ నగరం బెంబేలెత్తింది. చిన్నపాటి వర్షానికి అక్కడక్కడ డ్రైయిన్లు పొంగడం సాధారణం కాగా శనివారం విజయవాడ నగరాన్ని కృష్ణమ్మ ముంచెత్తిందా అన్నట్లు నగరం జలమయంగా మారింది. పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్, పలు కాలనీలు, శివారు ప్రాంతాలు, దాదాపు అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. కార్లు, బస్సులు రహదారులపై నిలిచిన వరదలో చిక్కుకుపోయి మొరాయించాయి. ఇక ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అండర్‌గ్రౌండ్‌ వంతెనలు నీటితో నిండిపోయాయి.

వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం :విజయవాడ నగరం జలదిగ్బంధంలో ఉండటంతో బస్సు సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ నగరంలో శనివారం ఉదయానికి దాదాపు 17.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోతగా వర్షం ఒక ఎత్తు అయితే ఎక్కడా డ్రైన్లు నీరు ప్రవహించే విధంగా లేవు. రోడ్లపైకి వరద వచ్చింది. అన్ని చోట్ల దాదాపు మూడు అడుగుల లోతులో నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాలనీలలోకి నివాసాల్లోకి నీరు చేరింది. వన్‌టౌన్‌ మొత్తం జలమయంగా మారింది. బస్టాండు ప్రాంతంలో రైల్వే అండర్‌ గ్రౌండ్‌ వంతెన దాదాపు ఆరేడు అడుగులు నిండిపోవడంతో బస్సులు సైతం తిరగలేదు.

బస్సు సర్వీసులు రద్దు :మధురానగర్‌ వంతెన వద్ద 5 అడుగుల వరకు నీరు నిలిచిపోయింది. కృష్ణలంక అండర్‌గ్రౌండ్‌ వంతెన వద్ద అదే పరిస్థితి. సాధారణంగా అక్కడ మోటార్లు ఏర్పాటు చేసి వరదనీరు ఎత్తిపోస్తారు. శనివారం ఇంజిన్లు పాడయ్యాయని వదిలేశారు. నీరు నిండిపోయి రవాణా స్తంభించింది. ఏలూరు రహదారిలో రామవరప్పాడు వద్ద వరద ముంచెత్తడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆటోనగర్‌ నుంచి బెంజిసర్కిల్‌ వరకు నీరు నిలిచింది. నిర్మల కాన్వెంట్, పాలీ క్లినిక్‌ రహదారి, అయిదో నంబరు రూట్, ఏలూరు రోడ్డు, భవానీపురం, విద్యాధరపురం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ సమీపంలో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహాదారిపై భారీగా వరద నీరు నిలిచింది. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్, సహా లారీలు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు - Heavy Rains In Hyderabad

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు - లోతట్టు ప్రాంతాలు జలమయం - స్తంభించిన జనజీవనం - Heavy Rain in Telangana

Last Updated : Sep 1, 2024, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details