తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 11:51 AM IST

Updated : 16 hours ago

ETV Bharat / state

మూసీ ప్రక్షాళన షురూ - పరీవాహక ప్రాంతాల్లో సర్వే స్టార్ట్​ - ఆ భవనాలకు మార్కింగ్ - Musi River Re Survey

Musi River Re Survey : మూసీ సుందరీకరణలో భాగంగా నది పరీవాహక ప్రాంతాల్లో అధికారులు రెండో రోజు సర్వే నిర్వహించారు. నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, వాటి యజమానుల వివరాలు సేకరించి మార్కింగ్‌ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే, మార్కింగ్‌ చేసిన ఇళ్లను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కొన్నిచోట్ల అధికారుల సర్వేలను అడ్డుకునేందుకు బాధితులు యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Government Conducting Re Survey On Musi River
Government Conducting Re Survey On Musi River (ETV Bharat)

Government Conducting Re Survey On Musi River :మూసీ ప్రక్షాలళన దిశగా అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి నదీ గర్భంలో ఉన్న ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల సహా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. మూసీ రివర్‌ బెడ్‌లో ఉన్న ఇళ్ల వివరాలు, నిర్వాసితుల వివరాలను సేకరించారు.

వారికి మరోచోట రెండు పడకగదుల ఇళ్లను కేటాయించి, పరిహారం కూడా చెల్లించాకే, మార్కింగ్ చేసిన ఇళ్లను తొలిగింపు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. అప్పటివరకు బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే సర్వేలో భాగంగా మార్కింగ్‌ ప్రక్రియను కొన్నిచోట్ల స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను తొలిగిస్తే ఊరుకోబోమని, ప్రభుత్వం ఇచ్చే డబుల్‌ బెడ్​ రూం ఇళ్లు వద్దని ఆందోళనకు దిగారు.

5 బృందాలుగా ఏర్పడి మార్కింగ్ :చాదర్‌ఘాట్, శంకర్‌నగర్‌లో మూసీ నది బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేశారు. బహదూర్‌పురా, కిషన్‌బాగ్, అసద్‌బాబా నగర్ తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తూ మార్కింగ్ చేశారు. లంగర్‌హౌజ్ ఆస్రంనగర్‌లో మార్కింగ్ ప్రక్రియను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసుల సహాయంతో వారికి నచ్చచెప్తూ అధికారులు ముందుకుసాగారు. చేసేదేం లేక స్థానికులు నిరసనకు దిగారు.

తాము అన్ని అనుమతులు తెచ్చుకొని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేయడమంటే, తమ బతుకులతో ఆడుకోవడమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఇంట్లో తాము మూడు, నాలుగు కుటుంబాలుగా కలిసి ఉంటున్నామని ఇప్పుడు ప్రభుత్వం ఇస్తానంటున్న ఒక్క డబుల్‌ బెడ్ రూం ఇంట్లో తమ కుటుంబాలన్నీ ఎలా ఉండగలవని ఆందోళన వ్యక్తం చేశారు.

"మేముంటున్న ఇంటిపై లోన్​ కూడా తీసుకున్నాం. అది ఇంకా తీరలేదు. మేము కట్టుకున్నంత ఇళ్లు ఇస్తానంటే సరే, లేకుంటే ఇక్కడ నుంచి వెళ్లేది లేదు. ఆక్రమించిన పెద్దోళ్ల ఇళ్లు కూల్చేదు లేదు కానీ పేదోళ్ల బతుకులతో ఆడుకుంటున్నారు. మేము తెలియక కొన్న స్థలాలపై మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడకని పోవాలి. ఇప్పటివరకు మూసీ నది నీళ్లు ఒక్కచుక్క కూడా రాలేదు. మరి ఎందుకని ఇప్పుడు విరగగొడుతున్నారు."-బాధితులు

మాకు విషం ఇచ్చి మా ఇళ్లకు మార్కింగ్ చేయండి : చైతన్యపురి ఫణిగిరి కాలనీ, న్యూమారుతి నగర్, సత్యనగర్‌లలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పోలీసులు, రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు విషం ఇచ్చి తమ ఇళ్లకు మార్కింగ్ చేసి తొలగించండి అంటూ ఆందోళన చేశారు. అధికారులు రివర్‌ బెడ్‌లో ఉన్న ఇంటి వివరాలు, యజమానుల వివరాలు నమోదుచేసే పత్రాలను ఒక్కసారిగా ఆగ్రహంతో స్థానికులు చింపేశారు. మార్కింగ్ చేసేందుకు ఉపయోగించే ఎరుపు రంగును సిబ్బంది నుంచి లాక్కున్న ఓ యువకుడు, దూరంగా విసిరేశాడు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రివర్‌బెడ్‌లో ఉన్న నిర్మాణాల సర్వే, మార్కింగ్‌ ప్రక్రియ అంతా ఆయా ప్రాంతాలకు చెందిన కలెక్టర్, డిప్యూటి కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లు, పోలీసులు, విజిలెన్స్ అధికారుల సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు మాత్రం తమ ఇళ్ల తొలగింపునకు ససేమిరా అంటున్నారు. అధికారులు మాత్రం పునరావాస చట్టం ప్రకారం బాధితులకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు, పరిహారం చెల్లించాకే మూసీ నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు - జీవో జారీ - CM Revanth Review On Musi River

మూసీ ప్రక్షాళనకు డేట్ ఫిక్స్ - రేపటి నుంచే రంగంలోకి దిగనున్న హైడ్రా - Demolition of Musi Encroachments

Last Updated : 16 hours ago

ABOUT THE AUTHOR

...view details