ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 12:15 PM IST

ETV Bharat / state

ప్రమాదకరంగా గోరుకల్లు జలాశయం - మట్టికట్ట కుంగడంతో ఆందోళనలో ప్రజలు

Gorukallu Reservoir in Danger: నంద్యాల జిల్లాలోని గోరుకల్లు జలాశయం మట్టికట్ట కుంగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులు చేసినా మట్టికట్ట కుంగిపోవడంతో జలాశయ నిర్వహణ ప్రమాదకరంగా మారింది. అధికారుల తీరుపై గోరుకల్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Gorukallu_Reservoir_In_Danger
Gorukallu_Reservoir_In_Danger

Gorukallu Reservoir in Danger: నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయం మట్టికట్ట కుంగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి గోరుకల్లు జలాశయం కట్ట ప్రమాదకరంగా మారింది. రోజు రోజుకు పలుచోట్ల కుంగిపోయింది. దీంతో గోరుకల్లు జలాశయం మట్టికట్ట ప్రమాదకర స్థితికి చేరుకుంది.

రోజురోజుకు పలుచోట్ల కట్ట కుంగిపోవడంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మట్టికట్ట కుంగిన ప్రభావం సాగునీరుపై తీవ్ర ప్రభావం రైతులు ఆందోళన చెందుతున్నారు. గోరుకల్లు జలాశయంలో ఇప్పటికే 3.5 టీఎంసీల వరకు నీరు ఉన్నాయి. మెట్ట పంటలను సాగు చేసుకోమని గతంలో అధికారులు చెప్పారు. దీంతో ప్రతి 10 రోజులకు ఒకసారి ఐదు రోజులు పాటు ఎస్ఆర్బీసీ (Srisailam Right Bank Canal) పంట కాలువల ద్వారా నీటిని అందిస్తున్నారు.

పంట చేతికి వచ్చే సమయంలో రైతులలో ఆందోళన:అయితే తాజాగా మట్టికట్ట కుంగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నీరు అంతంత మాత్రంగా విడుదల చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఇలా జరిగిందని, ఏం చేయాలో తెలియట్లేదని అంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో సాగునీరు అందుతాయో లేదో అన్న భయంగా ఉందని రైతులు వాపోతున్నారు.

ఒక గేటు కొట్టుకుపోయినా బుద్దిరాలేదు - ఇప్పుడు మరో గేటు తెగిపడింది ! గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వాహణపై విపక్షాల ధ్వజం

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా?: వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గోరుకల్లు జలాశయ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జలాశయానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతోనే ఇలాంటి ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి భయపడి అధికారులు సైతం జలాశయానికి సంబంధించిన వాటిపై నిజాలు వెల్లడించడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టిన అధికారులు: అయితే మట్టికట్ట కుంగిపోవడం ఇదేమీ మొదటి సారి కాదు. 2023 మే నెలలో మట్టికట్ట రెండు చోట్ల కుంగిపోయింది. హుటాహుటిన మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు అధికారులు. వెంటనే ఓ సంస్థతో పనులు పూర్తి చేయించారు. మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ గోరుకల్లు మట్టికట్ట కుంగడంతో పనుల నాణ్యతపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం: తాత్కాలిక పనులతో మట్టికట్టకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని అధికారుల తీరుపై గోరుకల్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జలాశయం ముందువైపు ఉన్న కట్ట కోతకు గురి కావడం ప్రమాదకరంగా ఉందని హెచ్చరించినా, ప్రభుత్వంలో చీమకుట్టినట్టు కూడా లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులే వాటిని కప్పిపుచ్చడానికి మరమ్మత్తులు పనులు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు.

Althurupadu Lift Scheme బిల్లులు చెల్లించలేదు.. అటకెక్కిన ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం!

ABOUT THE AUTHOR

...view details