తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ - సర్కార్​తో కీలక ఒప్పందం - GOOGLE SAFETY ENGINEERING CENTER

హైదరాబాద్​ నగరంలో జీఎస్​ఈసీ ఏర్పాటుకు ప్రభుత్వంతో కీలక ఒప్పందం - డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్న సీఎం

GOOGLE SAFETY ENGINEERING CENTER
గూగుల్​ ప్రతినిధికి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2024, 6:57 PM IST

Google in Hyderabad : డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఐటీ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సైబర్‌ సమస్యలపై హైదరాబాద్‌ కేంద్రంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఇవాళ గూగుల్ ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు. ఈ మేరకు జీఎస్‌ఈసీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ కీలక ఒప్పందం చేసుకుంది.

ఈ సందర్భంగా గూగుల్ సీఐఓ రాయల్ హన్సెన్, అరిజిత్ సర్కార్, శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నాయని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, మెటా సంస్థల ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయని రేవంత్ రెడ్డి అ​న్నారు. సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని, గ్లోబర్ హబ్‌గా మారేందుకు హైదరాబాద్‌కు అన్ని అవకాశాలున్నాయని గూగుల్ సీఐఓ రాయల్ హన్సెన్ వెల్లడించారు.

దేశంలోనే మొట్టమొదటిది : సైబర్, డిజిటల్ సెక్యూరిటీ, సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ అనుకూల ప్రాంతమని రాయల్ హన్సెన్ తెలిపారు. దేశంలోని మొట్టమొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో స్థాపించే సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదోవది కాగా ఏషియా పసిఫిక్ జోన్‌లో టోక్యో తర్వాత రెండోది కావడం గమనార్హం.

ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్‌క్లేవ్‌లోనే సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్ఈసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించేలా ప్రభుత్వం కృషి చేసింది. గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది.

'ఐటీ హబ్‌-2'కు శ్రీకారం చుట్టి మూడేళ్లు - రూ.36 కోట్లతో పనులు ప్రారంభించిన కనిపించని పురోగతి

కొలువులకు రాచబాట - ఐటీ శిక్షణా కేంద్రాల కేరాఫ్ అడ్రస్​ @అమీర్​పేట

ABOUT THE AUTHOR

...view details