తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 10:24 PM IST

ETV Bharat / state

వానాకాలం ప్రారంభంలోనే అన్నదాతకు సవాళ్లు - జనుము, జీలుగు విత్తనాలు దొరక్క అవస్థలు - Farmers Struggle for Seeds Shortage

Farmers Struggling for Seeds Shortage : వానాకాలం సీజన్​ ఆరంభం నుంచే అన్నదాతకు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఏటా కష్టాల కడలిని ఎదురీదుతూ మరోమారు తదుపరి పంట కోసం సన్నద్ధమవుతున్న రైతులకు అధికారుల నిర్లక్ష్యం తీరని శాపంగా మారుతోంది. మండుటెండల్ని లెక్కచేయక పడిగాపులు కాస్తున్నా పచ్చిరొట్ట విత్తనాలు దొరకట్లేదు. ఒకటీ, అరా దొరికినా అవి ఎందుకు సరిపోయే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Struggling for Seeds Shortage in Telangana
Farmers Struggling for Seeds Shortage in Telangana (ETV Bharat)

వానాకాలం ప్రారంభంలోనే అన్నదాతకు సవాళ్లు - జనుము, జీలుగు విత్తనాలు దొరక్క అవస్థలు (ETV Bharat)

Farmers Struggling for Seeds Shortage in Telangana :ఏటికేడు అన్నదాతకు సవాళ్ల సాగు తప్పట్లేదు. నీటి ఎద్దడి, అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి నిరీక్షణ రైతన్నలను వరుసగా వేధించాయి. గత కష్టాలను దిగమింగి మరోమారు సాగుకు సన్నద్ధమవుతున్న కర్షకులకు ఆదిలోనే కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. పచ్చిరొట్ట పైర్లు భూసారాన్ని పెంచి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. అధికారుల నిర్లక్ష్యంతో జనుము, జీలుగ విత్తనాల కోసం అన్నదాతలకు అరిగోసలు తప్పట్లేదు. తినీ తినకా పొద్దస్తమానం లైన్లలో నిలుచున్నా దొరుకుతాయో లేదో అన్నది దైవాధీనంగానే మారుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లావ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. డిమాండ్​ మేరకు విత్తనాలు అందుబాటులో లేక హలధారి ఆందోళనకు దిగుతున్నాడు. పోలీసులు నియంత్రించే క్రమంలో తోపులాట జరిగి గాయాల పాలవుతున్నారు. మెదక్​ జిల్లా మిరుదొడ్డిలో రైతులు గంటల తరబడి ఎండలోనే బారులు తీరారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పత్తి విత్తనాల కోసం అన్నదాతలు పాసుపుస్తకాలు లైన్లలో పెట్టి వేచి చూశారు. అధికారులు స్పందించి జనుము, జీలుగ విత్తనాల కొరత లేకుండా చూడాలని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో రైతులు కోరారు.

రెండు, మూడు రోజులు ఆగితే ఇబ్బంది ఉండదు : జనుము, జీలుగ విత్తనాల కొరత తీర్చేందుకు విత్తన కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సరిపడా నిల్వలు వస్తే ఇబ్బందులు తప్పుతాయని వెల్లడిస్తున్నారు. క్యూలైన్​లో నిల్చుని ఉన్న ప్రతి రైతుకు రెండు ప్యాకెట్లు విత్తనాలు ఇస్తున్నామని తెలిపారు.

"కంపెనీల ప్రతినిధులతో రోజు చర్చలు జరుపుతున్నాము. ఇంకో నాలుగు ఐదు రోజులలో మళ్లీ పంపిస్తామని చెబుతున్నారు. విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. క్యూలైన్లలో ఉన్న రైతులందరికీ విత్తనాలు అందిస్తున్నాం. రైతుకు రెండు చొప్పున క్యూలైన్​లో ఎంత మంది ఉన్నారో వారందరికీ ఇస్తున్నాము."- వ్యవసాయ అధికారి

రైతన్నలపై లాఠీఛార్జీ ప్రభుత్వ దాడే : ఆదిలాబాద్‌లో రైతన్నలపై లాఠీఛార్జీ ప్రభుత్వ దాడి కిందకే వస్తుందని బీఆర్​ఎస్​ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో కర్షకులపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, దిల్లీ పర్యటనలు చేయడం సిగ్గుచేటని కేటీఆర్​ విమర్శించారు. కాంగ్రెస్‌ తెస్తామన్న మార్పు రైతులపై దాడులు చేయడమేనా అంటూ ఆక్షేపించారు. బీఆర్​ఎస్​ హయాంలో విత్తనాలు, ఎరువులు, కరెంట్‌కు కొరత లేదని కేటీఆర్​ అన్నారు. ఐదు నెలల్లో సాగు పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిందని మండిపడ్డారు. రైతులపై లాఠీ ఝళిపించినందుకు కాంగ్రెస్​ సర్కార్​ తక్షణమే క్షమాణ చెప్పాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాల పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

కరీంనగర్​లో పచ్చిరొట్టె విత్తనాల కొరత - ఎండలో నిల్చోలేక క్యూలో పాస్‌బుక్కులు, చెప్పులు - JEELUGU SEEDS SHORTAGE IN TELANGANA

విత్తనాలడిగితే రైతులపై లాఠీఛార్జ్ చేస్తారా? - ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? : కాంగ్రెస్​పై బీఆర్ఎస్ ఫైర్ - BRS SLAMS GOVT ON SEEDS SHORTAGE

ABOUT THE AUTHOR

...view details