Jagan Luxurious Residence in Rushikonda at AP : అణువణువునా పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించారు. వాటితో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్నా సంతృప్తి చెందని జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా పూర్తిచేసిన ఏకైక ప్రాజెక్టు రుషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం.! రుషికొండపై భవనాల్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండోయ్.! ఆ ఆస్తులన్నీ భద్రంగా దాచుకుని వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చుపెట్టేశారు.
Vizag Rushikonda Palace in Andhra Pradesh : ఏకంగా రూ.452 కోట్లతో విలాసవంతమైన నివాస, కార్యాలయ భవనాలు ఏడింటిని బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే మూడు ఉన్నాయి. వాటిలో పడక గదులు పన్నెండు! ప్రతీ పడక గదినీ అనుసంధానిస్తూ అత్యంత విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు. ఆ స్నానాల గదుల్ని చూస్తేనే సామాన్యులకు కళ్లు తిరుగుతాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారిపై ఐదేళ్లూ తెగ ప్రేమ నటించిన జగన్ వారికి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది సెంటు భూమి.! దానిలో గరిష్ఠంగా 430 చదరపు అడుగుల ఇల్లు కట్టుకోగలరు. కానీ జగన్ బాత్రూం వైశాల్యమే 480 చదరపు అడుగులు.! అంటే పేదల ఇళ్లు జగన్ బాత్రూం అంత కూడా లేవన్న మాట.!
రూ.452 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణం : రుషికొండపై భవనాలకు రూ.452 కోట్ల అంచనా వ్యయంలో ఇప్పటికే రూ.407 కోట్లు ఖర్చు పెట్టేశారు. అవన్నీ సర్వహంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో ఇప్పటికే సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు. మళ్లీ తానే గెలుస్తానని, ముఖ్యమంత్రిగా 30ఏళ్ల పాటు తానే ఉంటానని జగన్ కన్న కలలన్నీ కల్లలైపోయాయి. కానీ రాజధానిని విశాఖకు మార్చేసి, రుషికొండపై కొలువు తీరాలనుకున్న జగన్ కుట్రపూరితంగా భారీ విధ్వంసానికి తెగబడ్డారు.
సీఎం నివాసానికి అనుకూలమని సిఫార్సు :రుషికొండపై గతంలో పర్యాటకశాఖ నిర్మించిన, చక్కగా, దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. అక్కడ ముఖ్యమంత్రి కోసం నివాస, కార్యాలయ భవనాల్ని కడుతున్నా అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా, అధికారులు మాత్రం అవి రిసార్టులేనని బుకాయిస్తూ వచ్చారు. చివరిగా మరో నాటకానికి తెరతీశారు. వారి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో ఒక కమిటీ వేసి, రుషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించారు.
శ్రీలక్ష్మి ఆధ్వర్యంలోని కమిటీ విశాఖలో అన్ని భవనాలూ పరిశీలించిందని, చివరకు రుషికొండపై కట్టిన భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని గుర్తించినట్టు పెద్ద డ్రామా పండించారు. వాటిలో కొన్ని మార్పులు చేస్తే సీఎం నివాసానికి, కార్యాలయానికి చక్కగా సరిపోతాయని ఆమెతో చెప్పించారు. అదంతా పెద్ద డ్రామా.! వాటిలో ఏ మార్పులూ చేయక్కర్లేదు. నేరుగా వెళ్లి వాటిలో ఉండొచ్చు. కానీ వైఎస్సార్సీపీ వాళ్లు ఒకటి తలిస్తే ప్రజలొకటి తలిచారు. ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపారు.
అత్యంత రహస్యంగా నిర్మాణాలు : రుషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లూ అనుమతి లేకుండా అక్కడికి చీమనూ చొరబడనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందల మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకుంది. మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం, మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఆదివారం రుషికొండ భవనాల్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది. రూ.400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి, దర్పం ఉట్టిపడేలా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఆ భవనాల్ని చూసినవారికి కళ్లు చెదిరిపోయాయి.