తెలంగాణ

telangana

ETV Bharat / state

నూనెలు కొనలేం! - పప్పులు తినలేం!! - పండుగల వేళ వంటింట్లో 'ధర'ల మంట - Essentials Price Increased - ESSENTIALS PRICE INCREASED

Essentials Prices Increased : పండుగల సీజన్‌ వేళ నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. నూనె, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పులు ఇలా ప్రతి ఒక్కదాని ధర అమాంతం పెరిగి, సామాన్య ప్రజలపై కొండంత భారాన్ని మోపుతున్నాయి.

Essentials Price Increased During Festival Season
Essentials Price Increased During Festival Season (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 9:16 AM IST

Updated : Sep 28, 2024, 2:28 PM IST

Essentials Prices Increased During Festival Season :పండుగల సీజన్‌ వేళ నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్లు, మాల్స్‌లోనూ సరకుల ధరలు మండిపోతున్నాయి. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచుతున్నట్లు ఈ నెల 14న ప్రకటించగా, మరుసటి రోజు నుంచే వాటి ధరలు పెరిగాయి. కేంద్రం కేవలం ఆయిల్‌పామ్, సోయా, పొద్దు తిరుగుడులపై మాత్రమే సుంకం విధించినా, మిగిలిన అన్ని వంట నూనెల ధరలనూ కంపెనీలు, వ్యాపారులు పెంచేశారు.

అవకాశంగా తీసుకుని ధరలు పెంచి :పండుగల సీజన్‌ను వ్యాపారులు తమకు అవకాశంగా తీసుకోవడంతో నూనెల ధరలు పెరిగిపోయాయి. నగరాలు, పట్టణాల్లోని దుకాణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు కూడా ధరలను పెంచాయి. మాల్స్‌లోని నిల్వలను నల్ల బజారుకు తరలించి అధిక ధరలకు అమ్ముతున్నారు. రాష్ట్రంలో రోజుకు 100 టన్నుల నూనె వినియోగమవుతుంటే, పండుగల సమయాల్లో రోజుకు 150 టన్నులు వినియోగిస్తారు. ఈ లెక్కన ధరల పెరుగుదల వినియోగదారులకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారింది.

అల్లం వెల్లుల్లి ధరలు పెరిగిపోతున్నాయి :వారం రోజుల వ్యవధిలోనే అల్లం, వెల్లుల్లి ధరలు రూ.60 చొప్పున పెరిగాయి. అల్లం కిలో రూ.100 నుంచి రూ.160 పలుకుతుండగా, వెల్లుల్లి రూ.300 నుంచి రూ.360కి పలుకుతుంది. మాల్స్‌లో అయితే వెల్లుల్లి ధర రూ.400. ఉల్లిపాయలు గత పదిహేను రోజుల నుంచి కిలో రూ.60కి తగ్గడం లేదు. ఎండు మిర్చి ధర కిలో రూ.200 నుంచి రూ.250కి పెరిగింది. మరోవైపు పప్పుల ధ1రలు సైతం మండిపోతున్నాయి. కందిపప్పు కిలో ధర వారం వ్యవధిలో రూ.20 పెరిగి రూ.170కి చేరగా, పెసరపప్పు రూ.30 పెరిగి రూ.150కి, మినప పప్పు రూ.15 పెరిగి రూ.135కు, సెనగ పప్పు రూ.5 పెరిగి రూ.105 కు చేరాయి.

నిత్యావసర సరకుల ధరలు పైపైకి - దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో - ESSENTIALS RATES HIKE IN TELANGANA

ఇష్టారాజ్యంగా ధరలు పెంచి : కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న వంట నూనెల దిగుమతిపై సుంకాన్ని పెంచింది. దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న కారణంగా స్థానిక రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అప్పటికే వ్యాపార సంస్థల్లో, నూనె తయారీ కంపెనీల్లో రెండు నెలల వరకు సరిపోయే నిల్వలు ఉన్నందున, పాత ధరలతోనే విక్రయిస్తారని కేంద్రం భావించినప్పటికీ దీనికి భిన్నంగా నూనె తయారీ కంపెనీలు వెంటనే ధరలు పెంచాయి. దీనికి అనుగుణంగా వ్యాపారులు సైతం ధరలను ఇష్టారాజ్యంగా పెంచారు.

పట్టించుకోని అధికారులు :15వ తేదీ ఉదయం సాధారణంగా ఉన్న ధరలు, సాయంత్రానికి ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్పటికే ఉన్న నిల్వలను కూడా కొత్త ధరలతో విక్రయించారు. మాల్స్‌లో మాత్రం గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)పై జీఎస్టీ బిల్లులు ఇవ్వాల్సి ఉన్నందున, ఎక్కువ ధరకు విక్రయిస్తే పట్టుబడతామన్న ఉద్దేశంతో నల్ల బజారుకు తరలించి విక్రయాలు జరిపారు. వినియోగదారులు అడిగితే మాత్రం కొత్త స్టాక్‌ వస్తేనే అమ్మకాలు చేస్తామని చెబుతున్నారు. వచ్చే నెలలో దసరా, దీపావళి పండుగల వరకు వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు ధరలపై నియంత్రణ కరవైంది. మాల్స్, హోల్‌సేల్‌ దుకాణాల వారు బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నా, అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

"నూనె ఉత్పత్తి కంపెనీల నుంచి వచ్చే దిగుమతులు, వాటి సూచనలకు అనుగుణంగానే ధరలను పెంచి విక్రయిస్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా సొమ్ము చెల్లిస్తేనే కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. అందుకే పెరిగిన ధరల ప్రకారం విక్రయిస్తున్నాం." - శ్రీనివాస్, రిటైల్‌ వ్యాపారి, నిజామాబాద్‌

Onions Price in Telangana : ఉల్లి ధరలకు రెక్కలు.. వినియోగదారులకు చుక్కలు

Daily Essentials Price Hike Telangana : అమ్మ బాబోయ్.. పెరిగిన నిత్యావసరాలు.. ఇక కొనలేం.. తినలేం..?

Last Updated : Sep 28, 2024, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details