English Teacher Beats Students : కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 9వ తరగతి విద్యార్థినులను కర్రతో ఓ టీచర్ చితకబాదారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు కాగా, ఒక విద్యార్థినికి తీవ్రంగా గాయాలయ్యాయి. చేతి వేలు విరగడంతో ఆసుపత్రిలో విద్యార్థిని చికిత్స తీసుకుంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులను కొట్టిన టీచర్పై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.
విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కాలేజీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలను ఇంగ్లీష్ టీచర్ సాధ్యం షాన్ విచక్షణారహితంగా కర్రతో కొట్టారు. దీంతో నలుగురు విద్యార్థినులకు గాయాలు కాగా, అందులో ఒకరికి చేతి వేలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబసభ్యులు అమ్మాయిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మిగిలిన ముగ్గురు విద్యార్థినుల చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కిటికీలోంచి చూశామని ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మమ్మల్ని ఇంగ్లీష్ టీచర్ కొట్టిందని విద్యార్థినులు చెబుతున్నారు. 9వ తరగతిలో ఉన్న మొత్తం 38 మంది విద్యార్థినులను ఇంగ్లీష్ టీచర్ కొట్టిందని వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియడంతో హాస్టల్కు వచ్చి తనిఖీ చేసి విచారణ చేపట్టారు.