Cyclone Threat to Andhra Pradesh :తుపాను వల్ల వచ్చిన భారీ వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో హెచ్చరిక. రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు పంపింది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం శనివారం నాటికి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత అది పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని చెప్పింది. దీంతో ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.
ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈనెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఇది తుపానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాతనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా.