తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్ బంకులో వివాదం - ముగ్గురు యువకులకు శిరోముండనం చేసిన పోలీసులు! - అసలు ఏమైందంటే?

పెట్రోల్ బంక్​లో రూ.20తో మొదలైన వివాదం - పోలీస్​స్టేషన్​లో యువకులకు శిరోముండనం - మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నంతో వెలుగులోకి ఘటన

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

NAGARKURNOOL DISTRICT SP
NAGARKURNOOL INCIDENT (ETV Bharat)

చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తాయి. రూ.5 కోసం ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ రెండు ఊళ్లకు పాకేలా చేసిన ఉదంతాలను చూశా. అలాంటి ఓ చిన్న వివాదంతో ఈ ఘటన మొదలైంది. పెట్రోల్‌ బంకులో జరిగిన గొడవ విషయంలో ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాలలో జరిగింది. గత ఆదివారం (అక్టోబర్​ 13) ఈ ఘటన జరగగా, వీరిలో ఓ యువకుడు మనస్తాపంతో శుక్రవారం (ఈ నెల 18) ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

స్థానికులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముగ్గురు యువకులు గత ఆదివారం రాత్రి లింగాలలోని ఓ పెట్రోల్‌ బంకులో రూ.20కు పెట్రోల్‌ పోయాలని నిర్వాహకుల్ని అడిగారు. అందుకు వారు తిరస్కరించడంతో యువకులకు, బంకు నిర్వాహకులకు మధ్య వివాదం తలెత్తింది. బంకు నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముగ్గురు యువకుల్ని పీఎస్​కు తరలించారు. వారిలో ఒక యువకుడు పోలీస్​స్టేషన్‌లో తల దువ్వుకోవడంతో ఆగ్రహించిన పోలీసులు ఠాణాలో ముగ్గురు యువకులకూ శిరోముండనం చేయించినట్టు సమాచారం.

వివరాల నిరాకరణ : ఈ ఘటన నేపథ్యంలో వారిలో ఓ యువకుడు తీవ్ర మనస్తాపంతో శుక్రవారం (అక్టోబర్ 18) ఇంట్లో ఉరేసుకోగా, గమనించిన కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, యువకుడి కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. యువకుల మధ్య గొడవతో మనస్తాపం చెంది, తమ బిడ్డ ఆత్మహత్యకు యత్నించాడని చెప్పి కుటుంబ సభ్యులు బాధితుడ్ని ఆసుపత్రిలో అడ్మిట్​ చేశారని వైద్యులు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ను వివరణ కోరగా, కొందరు యువకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం ఉందని అన్నారు. స్థానిక ఎస్సై 4 రోజుల నుంచి సెలవులో ఉన్నారని తెలిపారు. శిరోముండనం జరిగి ఉంటే కచ్చితంగా విచారణ చేయిస్తామన్నారు. ఈ ఘటనకు కారకులైన వారు, విషయం బయటికి రాకుండా బాధిత కుటుంబసభ్యులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. నేరం రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

శిరోముండనం కేసు- ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష - Venkatayapalem Shiromundanam Case

ప్రేమపెళ్లి చేసుకుందని కుమార్తెపై తల్లిదండ్రుల కర్కశం.. ఏం చేశారంటే?

ABOUT THE AUTHOR

...view details