తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.55 కోట్లు కాదు 600 కోట్లు దోచిపెట్టేందుకు ప్లాన్ చేశారు : సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH ON FORMULA E RACE

అసెంబ్లీలో ఈ కార్‌ రేసింగ్‌పై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - సభలో చర్చించాలని కేటీఆర్‌ ఇన్నాళ్లు ఎందుకు అడగలేదన్న ప్రశ్నించిన సీఎం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2024, 7:29 PM IST

CM Revanth Reddy On Formula E car Race :రూ.55కోట్లు కాదు రూ.600 కోట్లు దోచిపెట్టేందుకు ఫార్ములా ఈ- రేస్‌ నిర్వహకులతో మాజీ మంత్రి కేటీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. రేసింగ్‌ నిర్వహకులు వచ్చి తనతో సమావేశం కావడం వల్లే అసలు విషయం వెలుగుచూసిందని తెలిపారు. మంత్రివర్గం, ఆర్‌బీఐ అనుమతి లేకుండానే పౌండ్స్‌ రూపంలో చెల్లించారన్న రేవంత్‌రెడ్డి అక్రమాల బాగోతాన్ని నిగ్గుతేల్చేందుకు విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. నాలుగుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఫార్ములా ఈ రేసింగ్‌పై చర్చించాలని బీఆర్ఎస్ ఎందుకు పట్టుపట్టలేదన్న ఆయన ఈ కార్‌ రేసింగ్‌పై ఏసీబీ విచారణ కొనసాగటం, హైకోర్టులో విచారణ జరుగుతున్నందునే తాను ఎక్కువగా మాట్లాడటం లేదని అన్నారు.

CM Revanth Allegations On KTR :600 కోట్ల పెండింగ్‌ బకాయిలు చెల్లించాలంటూ ఫార్ములా రేసింగ్‌ నిర్వాహకులు వచ్చి తనను కలవడం వల్లే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రేసింగ్‌ నిర్వహకులు వచ్చి తనను కలుస్తామని చెప్పడం వల్లే అనుమతి ఇచ్చానని వారితో ఫోటో దిగినట్లు వివరించారు. ప్రభుత్వం సహకరిస్తే మరోసారి ఫార్ములా రేసింగ్ నిర్వహిస్తామని అడిగారన్న సీఎం ఆ విషయంపై ఆరా తీయడం వల్లే కేటీఆర్‌ బాగోతం బయటకు వచ్చిందని తెలిపారు. రేసింగ్‌ నిర్వాహకులతో కేటీఆర్‌ కుదుర్చుకున్నది రూ.55 కోట్ల ఒప్పందం కాదని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. మంత్రివర్గం ఆమోదం లేకుండా ప్రజాధనాన్ని దుబారాగా ఎలా ఖర్చు చేస్తారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

"ఈ కార్​ రేసు వ్యవహారంలో వీరు చేసుకుంది రూ.600 కోట్లు ఇవ్వడానికే . 55 కోట్లు ఇయ్యంగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి. లేకపోతే ఆయన జరా ఊ అంటే అంటే రూ.600 కోట్లు పోయేవి. రూ.55 కోట్ల ప్రజాధనం పోతే అది చిన్నమొత్తమా?. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పై ఉంది. సంవత్సరం నుంచి నానుతున్న విషయంపై నాలుగు సమావేశాల్లో ఏ రోజైనా ఫార్ములా రేసు గురించి బీఆర్ఎస్​ ఎప్పుడైనా మాట్లాడిందా? ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధం" - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

అక్రమాల బాగోతం తేల్చేందుకే విచారణకు ఆదేశించా :హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి కోట్ల డబ్బు లండన్‌లోని కంపెనీకి వెళ్లిందన్న సీఎం రేవంత్‌రెడ్డి రేసింగ్ నిర్వాహకులకు పౌండ్స్‌లో నిధులు చెల్లించారని స్పష్టంచేశారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండానే ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా విదేశాలకు తరలిస్తారని ప్రశ్నించారు. న్యాయనిపుణులతో పాటు అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత గవర్నర్‌ అనుమతి ఇచ్చారని చెప్పారు. అక్రమాల బాగోతం తేల్చేందుకే విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి వివరించారు.

ఈ కార్‌ రేసింగ్‌పై ఏసీబీ విచారణ జరుగుతున్నందున ఎక్కువ వివరాలు వెల్లడించలేనన్న సీఎం అక్రమాలు జరిగిన తీ్​రును త్వరలోనే ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. అక్రమాల బాగోతం బయటపడిందనే ఉద్దేశ్యంతోనే శాసనసభ నడవకుండా బీఆర్‌ఎస్‌ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారని రేవంత్‌రెడ్డి వివరించారు. ఫార్మూలా ఈ- రేస్‌పై అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు.

ఫార్ములా ఈ-కార్ల రేసింగ్​లో అసలేం జరిగింది? - ఏసీబీ విచారణలో ఏ అంశాలపై దర్యాప్తు జరగనుంది?

ఫార్మలా-ఈ రేస్​ కేసు - హైకోర్టులో కేటీఆర్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్

ABOUT THE AUTHOR

...view details