తెలంగాణ

telangana

తెలంగాణ గొంతు పార్లమెంటులో లేదనే - సింగరేణి ప్రైవేటీకరణకు ఆ రెండు పార్టీల కుట్ర : కేటీఆర్​ - KTR on Singareni Coal Mines

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 3:36 PM IST

KTR Fires on Congress and BJP Reason for Singareni Privatization : సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ తెలిపారు. బీఆర్​ఎస్​ హయాంలో ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చిన సింగరేణి గనులను వేలం వేయలేదని అన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో సింగరేణి ప్రాంత నాయకులు, కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు.

KTR Fires on Congress and BJP Reason for Singareni Privatization
KTR Fires on Congress and BJP Reason for Singareni Privatization (ETV Bharat)

BRS Leader KTR on Singareni Coal Mines Privatization : తెలంగాణ గొంతుకు పార్లమెంటులో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్​, బీజేపీ కలిసి సింగరేణి ప్రైవేటీకరణ కోసం కుటిల ప్రయత్నం చేస్తున్నాయని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు. సింగరేణి ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో ఆయన హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో సమావేశమయ్యారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు.

కేంద్రంతో ముఖ్యమంత్రి కుమ్మక్కై బీజేపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్​ ఆక్షేపించారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్​, బీజేపీ కుమ్మక్కై, నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికునికి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

"మాజీ సీఎం కేసీఆర్​ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పని చేయించారు. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించింది. సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమం కాలంలో అద్భుతంగా పని చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం బీఆర్​ఎస్​ విధానం. ఉద్యమకాలం నుంచి ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే తమ విధానం. ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చినా పక్కకు పెట్టి రైతుబీమాను, ఎల్​ఐసీ ఇచ్చారు. విద్యుత్​ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బీహెచ్​ఈఎల్​కు అప్పిగించాం. బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పని చేశామో ప్రతి సింగరేణి కార్మికునికి అవగాహన ఉంది.- కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

బీజేపీ, కాంగ్రెస్​ కలిసి బొగ్గు గనిని వేలానికి పెట్టాయి : కేటీఆర్​ అధికారంలో ఉన్నన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలకు పైగా తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా అపగలిగారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించినప్పటికీ తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నామని కేటీఆర్​ చెప్పారు. ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్​ ప్రభుత్వం, గెలిచి రెండు వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు, ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టాయని మండిపడ్డారు. సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్​ఎస్​ అని తెలిపారు. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్​ఎస్​ అండగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

బొగ్గు గనుల వేలానికి వేళాయే - 'శ్రావణపల్లి గని'ని సాధించేందుకు పట్టుదలతో సింగరేణి - Singareni attend Coal Mine Auction

ఆయనేం కేంద్రమంత్రయ్యా బాబు - కొత్త ప్రాజెక్టులు తేవాల్సిందిపోయి ఉన్నవి అమ్మేస్తున్నారు : కేటీఆర్ - KTR ON SINGARENI COAL MINES AUCTION

ABOUT THE AUTHOR

...view details