ARC SERVE Organisation : ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఆర్క్ సర్వ్, తన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మణికొండ ప్రభుత్వ పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇవాళ సంస్థ పదో వార్షికోత్సవ సంబురాలను పాఠశాల విద్యార్థులతో కలిసి చేసుకుంది. పాఠశాలలో చదువుకుని మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడంతో పాటు, ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు ఆర్ధిక సహాయం చేసింది.
ఈ పాఠశాలలో చదివి పదోతరగతిలో అగ్రశ్రేణి ఫలితాలు సాధించిన విద్యార్థులు డి. కుష్వంత్ రణచంద్రవర్మ (10/10), ఎస్. భార్గవి (9.8/10), బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన ఎం. మిర్యామిలను ఆర్క్ సర్వ్ సంస్థ సత్కరించి, వారికి ట్యాబ్లు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఆర్క్ సర్వ్ సంస్థ సీఈఓ క్రిస్ బాబెల్ మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో మణికొండ పాఠశాల విద్యాపరంగా, మౌలిక వసతుల పరంగా ఎంతో పురోగతి చూపుతోందన్నారు.,
పదోతరగతి ఫలితాలకు ఉపాధ్యాయులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, పరీక్షల్లో మార్కులు బాగా వస్తున్నాయని క్రిస్ బాబెల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ తరగతి గదులను అప్గ్రేడ్ చేయడంతో పాటు క్రీడామైదానాలనూ మెరుగుపరిచామని ఆయన తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు రూ. 8 లక్షల విరాళం ఇస్తున్నామని, ఏడుగురు అదనపు ఉపాధ్యాయులను నియమించనున్నట్లు తెలిపారు. 2022-23లో పదో తరగతి ఫలితాలు 182 మాత్రమే ఉండగా 2023-24లో అది 204కు పెరిగి, 10.78% వృద్ధి కనిపించిందన్నారు.